పద్మనాభం మండలంలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-04-13T06:14:08+05:30 IST

రోజురోజుకు కరోనా సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

పద్మనాభం మండలంలో కరోనా విజృంభణ

తీవ్ర భయాందోళన చెందుతున్న ప్రజలు

పద్మనాభం-రూరల్‌, ఏప్రిల్‌ 12: రోజురోజుకు కరోనా సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే మండంలోని రేవిడి పీహెచ్‌సీ పరిధిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి ఎన్‌వీ సమత తెలిపారు. దీంతో ఈ గ్రామంలో కేసుల సంఖ్య 21కి చేరిందన్నారు. అలాగే ఏనుగులపాలెంలో 15 మంది, పొట్నూరులో ముగ్గురు, రేవిడిలో ఒకరు, పద్మనాభంలో ఇద్దరు కొవిడ్‌ బారినపడినట్టు ఆమె పేర్కొన్నారు.  నానాటికీ కరోనా కేసులు పెరుగుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందళన చెందుతున్నారు. కాగా కరోనా విస్తరించకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించాలని డాక్టర్‌ సమత కోరారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. 


జీరుపేటలో..

తగరపువలస: తగరపువలస సమీపంలోని జీరుపేటలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందడంతో పలువురు వైద్య పరీక్షలు చేయించుకోగా ఆదివారం ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. ఇంకా కొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో గ్రామస్థులంతా తమకు వైద్య పరీక్షలు జరపాలని కోరుతున్నారు. అయితే వైద్య పరీక్షలకు తగరపువలస ఆరోగ్య కేంద్రానికి రమ్మంటున్నారని వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జీరు వెంకటరెడ్డి తెలిపారు.  వైద్య సిబ్బందే ప్రత్యేకంగా గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు పరీక్షలు జరిపాలని వైద్యాధికారులను కోరినట్టు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-04-13T06:14:08+05:30 IST