కడప నగరంపై..కరోనా దాడి
ABN , First Publish Date - 2020-07-10T10:32:15+05:30 IST
కడప నగరంపై కరోనా దండయాత్ర కొనసాగుతోంది. ఏప్రిల్ 1న కరోనా కడపలో అడుగుపెట్టింది.
వంద రోజులు.. 350 కేసులు
11 రోజుల్లో 245 మందికి పాజిటివ్ నమోదు
జిల్లాలో మరో 115 కేసులు
ఒక్క కడపలోనే 53
1690కి చేరిన బాధితుల సంఖ్య
(కడప - ఆంధ్రజ్యోతి):
కడప నగరంపై కరోనా దండయాత్ర కొనసాగుతోంది. ఏప్రిల్ 1న కరోనా కడపలో అడుగుపెట్టింది. జూలై 9కి వంద రోజులయింది. ఈ వంద రోజుల్లో 350 కేసులు నమోదయ్యాయి. ఈ 11 రోజుల్లో 245 కేసులు వచ్చాయంటే కరోనా వ్యాప్తి ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. తొలుత కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కరోనా నేడు నగరం నలుదిక్కులనూ చుట్టేసింది. లాక్డౌన్ వేళ కేసుల తీవ్రత తక్కువగా ఉండేది. అన్లాక్-1, అన్లాక్-2తో రాకపోకలు జరగడం, వాణిజ్య సముదాయాలు యధావిధిగా తెరుచుకుని కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో వైరస్కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నా జనం భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.
ఇక కొన్ని వాణిజ్య సముదాయాలైతే కనీసం శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఉదయాన్నే దుకాణం తెరిచింది మొదలు.. కనీస కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా లోపలికి అనుమతిస్తుండడంతో వైరస్ జెట్ స్పీడ్తో నగరాన్ని చుడుతోంది. కార్పొరేషన్ పరిధిలో కడప మండలంతో పాటు సీకేదిన్నె మండలం కొంత మేర ఉంది. కేవలం జూలై నెల తొమ్మిదిరోజుల్లోనే 182 కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 53 కేసులు వచ్చాయి. వీటిలో అక్కాయపల్లె, చిన్నచౌకు, బుగ్గలేటిపల్లె, బీకేయం స్ర్టీట్, భవానీనగర్, ఎన్జీవో కాలనీ, ప్రకాశ్నగర్, ఆలంఖాన్పల్లె, ఆర్వీనగర్, టీడీపీ కార్యాలయం ప్రాంతం, రామాంజనేయపురం, ఎర్రముక్కపల్లె, కాగితాలపెంట, మేదరవీధి, మాసాపేట్, ద్వారకానగర్, నాగరాజుపేట, పాతకడప, సీయోనుపురం, రాజారెడ్డివీధి, సీఎంఆర్పల్లె, దేవునికడప, రాజానగర్లలో నమోదయ్యాయి.
జిల్లాలో మరో 115 కేసులు
జిల్లాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. గురువారం 115 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో కడపలో 53, దువ్వూరు 11, వేంపల్లె 2, బద్వేలు 2, పులివెందుల 21, పోరుమామిళ్ల 3, వల్లూరు 2, లక్కిరెడ్డిపల్లె 2, మైదుకూరు 4, ఒంటిమిట్ట, రైల్వేకోడూరు, రాజంపేట, వేముల, పెండ్లిమర్రి, రామాపురం, ముద్దనూరు, పెనగలూరు, ఎర్రగుంట్ల, సింహాద్రిపురం, చెన్నూరు, ఖాజీపేట, చిన్నమండెంలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఒక రికి, విదే శాల నుంచి వచ్చిన ఒకరికి వైరస్ నిర్ధారణ అయింది. జిల్లాలో పాజిటివ్ల సంఖ్య 1690కి చేరుకుంది.
145 మంది డిశ్చార్జి
కరోనా బారిన పడి కోవిడ్-19 ఆసుపత్రిలో చికిత్సపొంది సంపూర్ణంగా కోలుకున్న 145 మందిని గురువారం డిశ్చార్జి చేసినట్లు కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తె లిపారు. ఇప్పటి వరకు 809 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు.
కడపలో 11 రోజులుగా కేసులు
జూన్ 29 26
జూన్ 30 27
జూలై 1 4
జూలై 2 25
జూలై 3 8
జూలై 4 21
జూలై 5 12
జూలై 6 9
జూలై 7 9
జూలై 8 41
జూలై 9 53
కోవిడ్-19 సమాచారం
మొత్తం శాంపిల్స్ - 84720
రిజల్ట్ వచ్చినవి - 80470
నెగటివ్ - 78780
పాజిటివ్ - 1690
డిశ్చార్జ్ అయినవారు - 809
రిజల్ట్ రావాల్సినవి - 4250
జూలై 9వ తేదీ తీసిన శాంపిల్స్ - 1265