కరోనా కట్టడిలో.. ఆంధ్ర వరస్ట్‌!

ABN , First Publish Date - 2020-08-10T09:53:07+05:30 IST

కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ ‘వరస్ట్‌’ అని ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ పేర్కొంది. వైరస్‌ విజృంభణలో గత రెండు వారాలుగా దేశంలోనే ముందుందని

కరోనా కట్టడిలో.. ఆంధ్ర వరస్ట్‌!

  • భారత్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లేలా ఉంది
  • రాష్ట్రాలన్నిటినీ అధిగమించేసింది
  • దేశంలో మూడో స్థానానికి వచ్చింది
  • గత రెండు వారాల్లో తీవ్ర విజృంభణ
  • రోజుకు పది వేల కేసుల పైమాటే!
  • అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఈ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువ
  • 13 జిల్లాలూ పోటీపడుతున్నాయి
  • కట్టడి జోన్లలో కొరవడిన నియంత్రణ
  • ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ ‘వరస్ట్‌’ అని ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ పేర్కొంది. వైరస్‌ విజృంభణలో గత రెండు వారాలుగా దేశంలోనే ముందుందని తెలిపింది. అన్ని రాష్ట్రాలను అధిగమించేసి.. మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. అంతేగాక.. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని.. ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా మారిందని తన తాజా సంచికలో ప్రత్యేక కథనం ప్రచురించింది. పరిపాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ‘ఇండియా టుడే’ మూడో ర్యాంకు ఇచ్చిందంటూ ఆయన సొంత పత్రిక పతాక శీర్షికన ప్రచురించింది. కానీ కరోనా విషయానికి వస్తే రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉందని.. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా మారుతుందని.. ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారతదేశాన్ని.. ప్రథమ స్థానానికి తీసుకెళ్తుందని అదే ‘ఇండియా టుడే’ పేర్కొంది. కరోనా విషయంలో తొలుత రాష్ట్రం స్థానికం నుంచి జాతీయ స్థాయికి.. ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందని తెలిపింది. కట్టడి జోన్లను ప్రకటించినా.. అక్కడ వైరస్‌ నియంత్రణ చర్యలు లేవు. ప్రతి ఒక్కరినీ పరీక్షించకపోవడం .. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని నిలువరించి ప్రత్యేక పరీక్షలు చేపట్టకపోవడమూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రతను పెంచేసిందని వివరించింది.


ఇండియా టుడే ఏమన్నదంటే...

ఆంధ్రలో తొలి కరోనా కేసు మార్చి 12న నమోదైంది. ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ యువకుడికి వైరస్‌ సోకింది. తొలి మరణం ఆ నెలాఖరులో విజయవాడలో చోటు చేసుకుంది. ప్రస్తుతం కేసుల సంఖ్యలో దేశంలోనే మూడో స్థానానికి చేరుకుంది. జూన్‌ ప్రారంభం నాటికి 4 వేల లోపున కేసులు ఉండగా.. జూలై మొదటికి 15 వేలకు చేరుకున్నాయి. ఆగస్టు ఆరంభం నాటికి లక్షన్నర దాటాయి (ఇప్పుడు 2.25 లక్షల వరకు చేరాయి).


తొలుత తబ్లిగీ జమాత్‌ భేటీకి వెళ్లివచ్చిన వారి వల్ల రాష్ట్రంలో వైరస్‌ విజృంభణ మొదలైంది. తర్వాత హాట్‌స్పాట్‌ నగరాల నుంచి వలస కూలీల ఆగమనంతో పతాకస్థాయికి చేరింది. ఈ కేసులు కొన్ని నగరాలకే పరిమితం కాలేదు. మొత్తం 13 జిల్లాల్లో సమానంగా పెరిగిపోతున్నాయి. గత రెండు వారాల్లో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ నమోదయ్యాయి. కొన్ని రోజులుగా రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్‌ చాలావరకు పట్టణాలకే పరిమితమైతే.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లోకూ విస్తరించింది.


ఇతర రాష్ట్రాలన్నిటి కంటే అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇక్కడ 10.84 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతుంటే.. జార్ఘండ్‌లో 11.31 రోజులకు.. బిహార్‌లో 13.91 రోజులకు.. అసోంలో 14.48 రోజులకు.. ఉత్తరప్రదేశ్‌లో 15.98 రోజులకు, కర్ణాటకలో 16.13 రోజులకు.. కేరళలో 16.49 రోజులకు.. ఒడిశాలో 16.5 రోజులకు.. పంజాబ్‌లో 16.68 రోజులకు.. బెంగాల్లో 19.25 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయి.


వైరస్‌ వ్యాపించిన మొదట్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండేది. జూన్‌ నెలాఖరు వరకు ప్రతి రోజూ కేసుల సంఖ్యలో ఆ రాష్ట్రమే ఫస్టు. తర్వాత ఢిల్లీ దూసుకెళ్లింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఆ స్థానంలోకి వచ్చింది.


ప్రపంచంలో కరోనా విజృంభిస్తున్న ప్రాంతాల్లో ఆంధ్ర కూడా ఉంది. అమెరికా, బ్రెజిల్‌ తర్వాతి స్థానం దానిదే. కొన్ని రోజులపాటు కొలంబియా కంటే కూడా ముందుంది. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగగ్‌ (జేహెచ్‌యూసీఎస్‌ఎస్‌ఈ) విడుదల చేసిన అంతర్జాతీయ డేటా దీనిని స్పష్టం చేస్తోంది.

Updated Date - 2020-08-10T09:53:07+05:30 IST