కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-06-23T05:25:09+05:30 IST
జిల్లాలో కరోనా కలకలం రేగింది. చాలా రోజుల తరువాత బుధవారం కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. థర్డ్ వేవ్లో భాగంగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కరోనాతో పాటు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. తరువాత కేసులు తగ్గుముఖం పడుతూ
తాజాగా నాలుగు కేసుల నమోదు
అధికార యంత్రాంగం అప్రమత్తం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్ 22: జిల్లాలో కరోనా కలకలం రేగింది. చాలా రోజుల తరువాత బుధవారం కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. థర్డ్ వేవ్లో భాగంగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కరోనాతో పాటు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. తరువాత కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అటు తరువాత జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతుండడం, వాతావరణంలో మార్పుల నేపథ్యంలో జిల్లాలో మళ్లీ కరోనా పరీక్షలను మొదలుపెట్టారు. బుధవారం 503 మంది నుంచి నమూనాలు సేకరించారు. కొత్తగా 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకూ జిల్లాలో 1,33,915 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 21,52,586 మందికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం నలుగురు హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
కానరాని నిబంధనలు
ఉత్తరాది రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. అక్కడి నుంచి వలస కూలీలు రావడం, వర్షాలు పడుతుండడంతో ఎక్కువ మంది జ్వరాల బారిన పడుతున్నారు. పరీక్షలు చేసుకుంటే కొవిడ్గా తేలుతోంది. అయితే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అంతటా నిర్లక్ష్యం నెలకొంది. కనీస నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం లేదు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరిచిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, షాపుల్లో ప్రజలు గుమిగూడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరముంది.