ఆగని కరోనా
ABN , First Publish Date - 2020-05-25T09:25:51+05:30 IST
జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఆదివారం కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి.
(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఆదివారం కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ విజయవాడ నగరంలోను, శివారు ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న కృష్ణలంకలో మరో ముగ్గురికి వైరస్ సోకింది. ఫీడర్ రోడ్డులో ఓ గృహిణికి, గంగానమ్మ గుడి రోడ్డులో 23 ఏళ్ల యువకుడికి, ద్వారకానగర్లో మరో వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పటమట పంటకాల్వ రోడ్డులో ఓ కిరాణా వ్యాపారికి, యనమలకుదురులో 35 ఏళ్ల యువకుడికి గుణదల్లో మరో వృద్ధుడికి, జక్కంపూడిలోని వైఎస్ఆర్ కాలనీలో ఓ మహిళకు వైరస్ సోకింది.
ఇబ్రహీంపట్నంలో ఒక యువతి, మరో యువకుడు, కొండపల్లిలో ఒక వ్యక్తి, ప్రసాదంపాడులో ఒక మహిళ కరోనా బారిన పడ్డారు. మైలవరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి వైరస్ సోకింది. వీరందరినీ చికిత్స నిమిత్తం కొవిడ్ ఆసుపత్రులకు తరలించారు. వారి కుటుంబ సభ్యులను, కాంటాక్ట్ అయినవారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 437కు చేరుకుంది.
పంటకాల్వ రోడ్డులో కలకలం
మొగల్రాజపురం : పటమట పంటకాల్వ రోడ్డులో ఒక కిరాణా వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం కలకలాన్ని సృష్టించింది. ఇతని ద్వారా ఇంకెంత మందికి వైరస్ సోకిందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇతనికి వైద్యం అందించిన ఆర్ఎంపీని కూడా ఆసుపత్రికి తరలించారు.