అన్ని ఏటీఎంల నుంచి కార్డ్లెస్ నగదు!
ABN , First Publish Date - 2022-05-20T08:53:38+05:30 IST
ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భావిస్తోంది.
బ్యాంకులను కోరిన ఆర్బీఐ
ముంబై: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భావిస్తోంది. ఇందులో భాగంగా కార్టు లేకుండానే ఖాతాతారులు ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా నగదు తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు సిద్ధమైంది. చురుగ్గా ఈ విషయం పరిశీలించాలని బ్యాంకుల్ని కోరింది. అన్ని ఏటీఎంల్లో ఇంటరాపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) ఆప్షన్ ద్వారా ఖాతాదారులకు ఈ వెసులుబాటు కల్పించాలని కోరింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, తమ ఖాతాదారులకు మాత్రమే తమ సొంత ఏటీఎంల వద్ద ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. దీన్ని అన్ని బ్యాంకుల ఖాతాదారులకు కల్పించాలని ఆర్బీఐ కోరింది. ఇలా చేయడం ద్వారా స్కిమ్మింగ్, కార్డు క్లోనింగ్, డివైస్ ట్యాంపరింగ్ వంటి నేరాకు చెక్ పెట్టవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎన్పీసీఐ తమ యూపీఐ వ్యవస్థను అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్వర్క్లతో అనుసంధానం చేయాలని కోరింది.