ప్రభుత్వంతో సహకరించండి
ABN , First Publish Date - 2020-08-08T08:37:22+05:30 IST
కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి ..
రెండు గంటలకోసారి బెడ్ల వివరాలు ప్రదర్శించాలి
ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలి
ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సమావేశంలో
జిల్లా కలెక్టర్
అనంతపురం అర్బన్, ఆగస్టు 7 : కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా అత్యవసర పరిస్థితుల్లో చిన్నచిన్న సమస్యలను అధిగమించి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కరోనా బాధితులకు వైద్యసేవలు అం దించేందుకు స హకరించాలన్నారు. కొవిడ్ ఆసుపత్రులుగా గుర్తించిన ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. ఆయా ఆస్పత్రుల తరఫున వారు కూడా ఒక నోడల్ అధికారిని నియమించి వారిరువురూ సమన్వయం చేసుకుని మెరుగైన వైద్యసేవలందించాలన్నారు.
అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల(మంచాలు) వివరాలను ప్రతి రెండు గంటలకు ఒకసారి బ్లాక్ బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ గుర్తింపులేని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల వైద్యసేవలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలన్నారు. గుర్తింపు పొందినవాటిలో ఆధార్ కార్డు ఆధారంగా ఉచిత వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డీసీహెచ్ఎ్స డాక్టర్ రమే్షనాథ్, నోడల్ అధికారి వరప్రసాద్, డిప్యూటీ రామ సుబ్బారావు, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ హర్షవర్ధన్, ప్రైవేట్ యాజమాన్యాల ప్రతినిధులు, డాక్టర్లు పాల్గొన్నారు.