ఎండలో తిరిగి ఇంటికి చేరుకోగానే చల్లని డ్రింక్ తాగేస్తున్నారా? అయితే..
ABN , First Publish Date - 2022-04-13T21:32:05+05:30 IST
ఎండ తీవ్రత బాగా పెరిగింది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం
ఆంధ్రజ్యోతి(13-04-2022)
ఎండ తీవ్రత బాగా పెరిగింది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. వేసవికాలంలో వడదెబ్బ బారినపడకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు. వారు సూచిస్తున్న ప్రత్యేక జాగ్రత్తలివి...
వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురవుతుంది. కాబట్టి తరచుగా నీరు తాగుతూ ఉండాలి. బయటకు వెళుతున్నట్లయితే తప్పనిసరిగా వాటర్బాటిల్ చెంత ఉంచుకోవాలి. ఈ సీజన్లో చెమట ఎక్కువ వస్తుంటుంది. ఆ చెమట ద్వారా మినరల్స్ బయటకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజా పండ్లు, ద్రవపదార్థాలు తీసుకుంటూ శరీరంలో ఎలక్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. వీలైనంత వరకు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు ఉంచుకోవాలి.
ఈ సీజన్లో కూల్డ్రింక్స్పైకి మనసు లాగుతూ ఉంటుంది. ఎండలో కాస్త తిరగగానే చల్లగా డ్రింక్ తాగాలని అనిపిస్తుంది. కానీ కూల్డ్రింక్స్ మంచివి కావు. వీటిల్లో ప్రిజర్వేటివ్స్, కలర్, షుగర్ ఉంటాయి. ఇవి ఎసిడిక్ గుణం కలిగి ఉండి డైయూరిటిక్స్గా పనిచేస్తాయి. చాలా సాఫ్ట్డ్రింక్ల్లో డైల్యూటెడ్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని ఎక్కువ తాగితే రక్తంలో ఫాస్ఫారిక్ లెవెల్స్ పెరిగిపోతాయి.
డ్రైఫూట్స్ మంచివే. అయితే వేసవిలో వాటికి బదులుగా తాజా పండ్లు తీసుకోవాలి.తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి. పండ్ల రసాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేపుడు పదార్థాలకు నో చెప్పాలి. లంచ్లో సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. కీరదోసతో చేసిన సలాడ్ చల్లదనాన్ని అందిస్తుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే గ్రీన్టీ తీసుకోవాలి. ఒక స్పూన్ ఉల్లిపాయ జ్యూస్ తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. సూర్యరశ్మి వల్ల కలిగే కణాల డ్యామేజీని తగ్గించడంలో ఇది బాగా ఉపకరిస్తుంది. ఎండలో తిరిగి ఇంటికి చేరుకోగానే చల్లగా ఉండే పానీయాలను, ఐస్క్రీమ్లాంటి పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎండ తాలూకు దుష్ప్రభావాలు తగ్గిపోతాయి.