డిప్యూటీ సీఎం ఇలాకాలో రెండు గ్రామాల మధ్య వివాదం

ABN , First Publish Date - 2021-03-20T21:38:22+05:30 IST

రైతు భరోసా కేంద్రాన్ని తమ గ్రామంలోనే నిర్మించాలంటూ

డిప్యూటీ సీఎం ఇలాకాలో రెండు గ్రామాల మధ్య వివాదం

చిత్తూరు: రైతు భరోసా కేంద్రాన్ని తమ గ్రామంలోనే నిర్మించాలంటూ ఓ గ్రామస్థులు, లేదు తమ గ్రామంలోనే నిర్మించాలని మరో గ్రామస్థులు పట్టువీడక పోవడంతో ఆ రెండు గ్రామాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ సంఘటన సాక్ష్యాత్తు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంత  నియోజకవర్గం గంగాధర నెల్లూరులోని పాలసముద్రం మండలంలో చోటు చేసుకుంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. రైతు భరోసా కేంద్ర ఏర్పాటు విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం ముదిరింది.


మండలంలోని నరసింహపురం పంచాయతీలో వివాదం నెలకొంది. పంచాయతీ కేంద్రంలోనే రైతు భరోసా కేంద్రం నిర్మించాలంటూ నరసింహాపురం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలైన రేషన్, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఆధార్ కార్డులను రోడ్డుపై పారబోసి తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్థులు నిరసనకు దిగారు. తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి టీవీఎన్ఆర్ పురం గ్రామస్థులు తమ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు చేపట్టారు. దీన్ని నిరసిస్తూ నరసింహాపురం గ్రామస్థులు అడ్డుకుని ధర్నా చేపట్టారు. దీంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. రెండు గ్రామాల మధ్య ఉన్న స్థలంలో భారీ ఎత్తున ధర్నా చేపట్టి తమ నిరసనను గ్రామస్థులు వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-20T21:38:22+05:30 IST