ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించండి
ABN , First Publish Date - 2022-05-20T21:01:43+05:30 IST
తెలంగాణలో ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్న తమ ప్రయత్నానికి సహకారం అందించాలని లండన్లోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా...
క్రాన్ఫీల్డ్ వర్సిటీ వీసీని కోరిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ(Telangana)లో ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ(University of Aeronautics) ఏర్పాటు చేయాలనుకుంటున్న తమ ప్రయత్నానికి సహకారం అందించాలని లండన్లోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ శాఖ మంత్రి కేటీఆర్(Minister for IT and Industries KTR) కోరారు. లండన్ పర్యటనలో భాగంగా రెండోరోజు ఆయన క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ చాన్సలర్ పోల్లార్డ్తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీ పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ, సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్.. నైపుణ్య శిక్షణ అభివృద్థికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పియర్సన్ సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. అలాగే హెచ్ఎ్సబీసీ సంస్థ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో తమ కార్యకలపాలను విస్తరించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకుని మరోసారి కలుస్తామని మంత్రికి వారు వివరించారు. అనంతరం ఫార్మాసుటికల్ కంపెనీ గ్లాక్సో స్మిత్ కేల్న్ (జీఎస్కే) ప్రతినిదులతోనూ చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్లో రూ. 710 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని, 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. గత రెండేళ్ల లో రూ.340 కోట్లను హైదరాబాద్ ఫార్మాలో పెట్టుబడిగా పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులు కేటీఆర్కు వివరించారు.
కింగ్స్ కాలేజీతో ఒప్పందం..
హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో కలిసి పనిచేసేందుకు లండన్లోని కింగ్స్ కాలేజీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి ఐటి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపు, పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజీ సహకరిస్తుంది.