పనికి రావట్లేదని బాలుడిపై దాష్టీకం!

ABN , First Publish Date - 2020-08-13T07:57:00+05:30 IST

ఓ బాలుడిపై యజమాని దాష్టీకమిది! రాళ్లు కొట్టే పనికి రావడం లేదని బాలుడి కాళ్లు, చేతులు

పనికి రావట్లేదని బాలుడిపై దాష్టీకం!

  • కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కాంట్రాక్టర్‌ 
  • నిజామాబాద్‌ మల్కాపూర్‌(ఏ) గ్రామంలో ఘటన 

నిజామాబాద్‌ రూరల్‌, ఆగస్టు 12 : ఓ బాలుడిపై యజమాని దాష్టీకమిది! రాళ్లు కొట్టే పనికి రావడం లేదని బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదిన అమానవనీయ ఘటన నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ (ఏ) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్కాపూర్‌(ఏ) గ్రామానికి చెందిన ముద్దంగుల బాలయ్య(55) రాళ్లు కొట్టే కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతని వద్ద పదుల సంఖ్యలో కూలీలు పనులు చేస్తున్నారు. వారిలో సమీప బంధువైన ముద్దంగుల పెద్ద బాలయ్య చిన్న కొడుకు(15) కూడా పని చేస్తున్నాడు. ఆరో తరగతి వరకు అదే గ్రామంలో చదివిన బాలుడు.. తండ్రి అనారోగ్యం, తల్లి మతిస్థిమితంలేని కారణంగా కుటుంబ పోషణ నిమిత్తం చదువు మానేసి కొన్నేళ్లుగా బాలయ్య వద్ద రాళ్లు కొట్టే పనిలో కుదిరాడు. అయితే కొద్దిరోజులుగా అతడు సరిగ్గా పనులకు వెళ్లడం లేదు. పనులకు సరిగ్గా రాకపోవడం.. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదన్న కోపంతో బుధవారం మధ్యాహ్నం మిత్రులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని పట్టుకుని బాలయ్య చితక్కొట్టాడు. కాళ్లు, చేతులను కట్టేసి రోడ్డు నుంచి ఇంటివరకు బలవంతంగా లాక్కెళ్లాడు. గాయాలపాలైన బాలుడు వద్దని వారించినా, కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. గ్రామ పెద్దలు వారించినా వినలేదు. ఇంటి సమీపంలోని ఇనుప రాడ్‌కు కట్టివేసి అక్కడే కాపలా ఉన్నాడు. చివరకు గ్రామ సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి వెళ్లి బాలుడిని విడిపించి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.  సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2020-08-13T07:57:00+05:30 IST