కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సిందే
ABN , First Publish Date - 2021-07-27T05:17:04+05:30 IST
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని.. తక్షణమే రెగ్యులరైజ్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఈ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా, ఏపీఎన్జీవో సంఘం మద్దతు తెలిపింది.
- డీఎంహెచ్వో ఆఫీసు వద్ద ఏపీడీఎస్సీ సీపీఎంఈ జేఏసీ ధర్నా
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 26 : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని.. తక్షణమే రెగ్యులరైజ్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఈ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా, ఏపీఎన్జీవో సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు మాట్లాడుతూ.. ‘డీఎస్సీ ద్వారా గత ఇరవై ఏళ్లుగా వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పారామెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నియామకాలు జరిగాయి. నూరుశాతం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు అర్హత కలిగి ఉన్నారు. ప్రజాసంకల్పయాత్ర సమయంలో ప్రస్తుత సీఎం జగన్కు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయాన్ని తెలియజేశాం. వీలైనంత ఎక్కువమందిని రెగ్యులరైజ్ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. దీన్నే మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచారు. అదే మాట ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సిన విషయంలో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయంటూ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం ఇచ్చిన హామీ అమలయ్యే వరకు ఆందోళనలు చేస్తామంటూ కాంట్రాక్టు ఉద్యోగులతో కలిసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, వైద్యఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు నారాయణరావు, రాజేశ్వరి, పి.అప్పారావు, జి.సోమేశ్వరరావు, ఆర్.సురేష్బాబు, సాయిప్రసాద్, మురళీ పాల్గొన్నారు.