నిరంతర భాషా కృషీవలుడు

ABN , First Publish Date - 2020-12-28T10:28:25+05:30 IST

తెలంగాణ ప్రాంత భాష ఇతర ప్రాంతాల భాష కన్నా భిన్నమైన వాగ్య్వవహారాన్ని కలిగి ఉన్నది. అందువలన సమైక్య రాష్ట్రం ఏర్పాటైన...

నిరంతర భాషా కృషీవలుడు

నలిమెల భాస్కర్‌ పద్నాలుగు భారతీయ భాషలను స్వయంకృషితో నేర్చుకున్నారు. తెలంగాణ భాష పట్ల ఉన్న అపోహలను దూరం చేశారు. మారుమూలల్లో ఉన్న పదాల తెలుగుదనం గురించి రాయడం ద్వారా భాషా గౌరవాన్ని ఇనుమడింపజేశారు. భాషను కూడా సులభ రీతిలో రాయడం ద్వారా భాషాభిమానులకు, పరిశోధకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు.


తెలంగాణ ప్రాంత భాష ఇతర ప్రాంతాల భాష కన్నా భిన్నమైన వాగ్య్వవహారాన్ని కలిగి ఉన్నది. అందువలన సమైక్య రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అక్కడి పండితులకు ఇది తౌరక్యాన్ధ్రంగా వినిపించింది. ఈ ప్రాంత వ్యవహార భాష ప్రభుత్వ పాలన, ప్రసార, విద్య, న్యాయ ఇత్యాది రంగాలలో పనికిరానిదయింది. తెలంగాణ పదంలోనే తెలుంగు ఉన్నప్పటికీ ఇక్కడ మాట్లాడేది తెలుగు కాదనే అపనింద ఈ ప్రాంత బుద్ధి జీవులను ఆలోచింప జేసింది, పరిశోధింపజేసింది. తెలంగాణ ప్రాంత భాష గురించి పరిశోధన, పరిశ్రమ చేసిన వాళ్ళలో బిరుదు రాజు రామరాజు, యశోదా రెడ్డి, రవ్వా శ్రీహరి, నలిమెల భాస్కర్‌ ముఖ్యులు. 


డా. నలిమెల భాస్కర్‌ తెలంగాణ ఉద్యమ తొలి దశ కాలానికి ముందు ద్రావిడ భాషలలోని ప్రధాన భాషల సామెతల మీద పరిశోధన చేశారు. తెలంగాణ భాషలో ‘రాతి గుండెలు’ పేరుతో 1976లో కవితను, 1977లో ‘మంద’ పేరుతో కథను రాశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో జరిగిన అనేక సభల్లో తెలంగాణ ప్రాంత తెలుగు విశిష్టతను ప్రసంగాల ద్వారా తెలియపరచారు. తెలం గాణ భాష గురించి చేసిన కృషిలో భాగంగా తెలంగాణ పదకోశం, బాణం వ్యాసాలు, పోతన తెలంగాణ పద ప్రయోగ సూచిక, బసవ పురాణ పద ప్రయోగ సూచిక (సంపా), తెలంగాణ పత్రికలో పలుకుబడి కాలమ్‌, తెలం గాణ భాష-దేశ్య పదాలు (2017), తెలంగాణ భాష- సంస్కృత పదాలు (2019), తెలంగాణ భాష-తమిళ పదాలు (2020) మొదలైన రచనలు చేశారు.


నలిమెల భాస్కర్‌ 2003లో రూపొందించిన ‘తెలంగాణ పదకోశం’ మొదటి తెలంగాణ మాండలిక పదకోశం. తెలంగాణ ప్రజల వ్యవహార భాషకు సంబంధించిన మొదటిపద సేకరణ ఇది. తనకు గుర్తున్న పదాలను, పదబంధాలను, సామెతలను రాశిపోశారు. అట్లాగే, తెలం గాణ ప్రాంత సాహితీ సంపుటాలను పరిశీలించారు. ఆనాటి ఉద్యమ అవసరాలకోసం ఏడు ఎనిమిది నెలల కాలంలో తయారైన కోశమిది. బహుభాషావేత్త కావడం వలన పదాల అర్థాలను సులువైన ప్రామాణిక భాషలో రాశారు. పదబంధాలకు, జాతీయాలకు, సామెతలకు అవసరమైన చోట వివరణలు ఇచ్చారు. ఈ పదకోశానికి రాసిన ముందుమాటను తెలంగాణ ఇంటర్మీడియట్‌ తెలుగు వాచక పాఠ్యాంశంగా తీసుకున్నారు. మొదట ఏడువేల పదాలతో వెలువడి తర్వాత సుమారు పదివేల పదాల పుస్తకంగా 2016లో పునర్ముద్రణ పొందింది.


తెలంగాణ భాష ప్రత్యేక లక్షణాలను విశ్లేషిస్తూ 2008లో వచ్చిన వ్యాస సంపుటి ‘బాణం’. దీని ద్వారా ఇంతకు ముందెవరూ చెప్పని తెలంగాణ భాష లక్షణాలను నిర్ధా రించే ప్రయత్నం చేశారు. ఇక్కడి పదాల ప్రత్యేకతకు కారణమైన నాదాత్మకత, లయాత్మకత, ద్విత్వీకరణ, సంయుక్తీకరణ, వ్యుత్పత్తులు, సామెతలు, జాతీయాల విశేషాలను వివరించారు. ప్రాచీన లక్షణాలు, అచ్చ తెలుగుతనం, ఉర్దూ భాషా ప్రభావం తదితర అంశా లపై సాధికారిక వివరణలు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఇతర భాషా పదాలను, పద బంధాలను స్వాంగీకరణం చేసుకునే తీరును వివరించారు. వనభోజనాలను వంటలకు పోవుడని; కేశఖండనాన్ని పుట్టెంటికలని; ఖనన హననా లను కాలేసుడు, బొందవెట్టుడని; అస్థికల నిమజ్జనాన్ని బొక్కలు కలిపివచ్చుడు అని తత్సమాలకు అసలు సిసలు తెలుగు మాటలు ఉపయోగిస్తారని ఉదాహ రించారు. క్రియా పదాలలోనూ, బంధుత్వ వాచకాల లోనూ, సంబోధనల్లోనూ ద్రావిడ లక్షణాలు, అచ్చ తెలుగు నుడులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయని విశ్లే షించారు. మహమ్మదీయ పాలనలో అంగూర్లు, సేపులు, మోసంబీలు, సంత్రాలు, చాపత్త, ఇజ్జత్‌, బేఫికర్‌ లాంటి మరెన్నో ఉర్దూ పదాలు తెలంగాణ తెలుగులో మిళితమ యినాయని చూపారు. ఇవేకాక, తెలంగాణ భాష ప్రామాణికత- ప్రతిపాదనలు పేరుతో తెలంగాణ భాషను విద్యా పరిపాలనా రంగాలలో వినియోగంలోకి తేవడానికి అనుసరించవలసిన పద్ధతుల గురించి రాశారు. తెలంగాణ భాషా, మాండలికమా అన్న చర్చ చేస్తూ తెలంగాణలో ఉన్నది చక్కటి తెలుగేనని దీన్ని మాండలికం అనవలసిన అవసరం లేదని నిర్ధారించారు.


పోతన ప్రాంతం గురించి వివాదాలు చెలరేగినప్పుడు వ్యాసాలు, కవితలు రాయడమే కాక, పోతన భాగ వతం ఆధారంగా తెలంగాణ ప్రాంతపద ప్రయో గాలను జల్లెడ పట్టారు. ఇది పుస్తకంగా రావలసి ఉన్నది. తెలుగులో నన్నయ, తిక్కన, నన్నెచోడ, శ్రీనాథుడు తదితరుల పదప్రయోగ కోశాలు వచ్చాయి. మరే లనో సోమన, పోతనలవి రాలేదు. ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తూ పాల్కురికి సోమన బసవ పురాణ పద ప్రయోగ సూచికను ఈ వ్యాసరచయితతో పాటు మరి కొందరితో కలిసి రూపొందించి ప్రకటించారు.


తెలంగాణ భాష దేశ్య పదాలు పుస్త కానికి ప్రధాన వనరు శబ్ద రత్నాకరం. దీనిలో దేశ్యములుగా గుర్తించబడిన వేల పదాలలో తెలంగాణ ప్రాంతంలో నేటికీ వాడుకలో ఉన్న పదాలను గూర్చి రాసిన వ్యాసాల సంకలనం. తత్సమ, తద్భవాలు కాకుండా తెలుగు ప్రాంతంలో వ్యవహారంలో ఉన్న పదాలు దేశ్యాలు. సంస్కృత, ప్రాకృత, ఉర్దూ, ఆంగ్ల పదాలు అనేకం వ్యవహార భాషలో చేరి దేశీ మాటలు పల్లెలకు పరిమితమవుతున్నాయి. ఎవరైనా ఉపయోగిస్తే వింతగా వినిపిస్తుంది ఇపుడు. తెలంగాణలో అటాంకల, ఇటాంకల అనే మాటలున్నాయి. వీటిలో ఉన్నది అంక అనే దేశ్యమని అంక అంటే ప్రక్క అని అర్థాన్ని చూపి వివరణ ఇచ్చారు. తెలంగాణలో కోలె అనే అవ్యయం ఉన్నది. ఇది నన్నయాదులు ప్రయోగించింది, పరమ ప్రాచీనమైనది. ఇది నేటికీ పండుగ్గోలె, ఆదివారం గోలె మొదలైన వాటిల్లో వాడుకలో ఉన్నదని, దీనికి నుండి, మొదలు, సమయము మొదలైన అర్థాలున్నాయని వివ రించారు. ఇట్లా అర్ర, అలుగు, అదలు, అచ్చు, అసలు, ఆడుబిడ్డ, కోర,గత్తర, గచ్చు, గెదుము, గుల, గొట్టు, గోటు, గోందు, చెలగు,చేగ, చానపి, చామ నలుపు, చిర్రు, చిల్లు, సోలుపూత, చుట్ట, చొప్పు, చోపు, జీబు, జంగిలి, తొగరు మొదలైన అనేక పదాల వెనుక ఉన్న మార్పులను, నేటి వాడుక తీరును వాక్య ప్రయోగాలతో వివరించడం వలన అందరికీ సులువుగా అర్థం చేసుకొనే వీలు కలుగుతుంది. 


తెలంగాణ భాష సంస్కృత పదాలు మరొక విలువైన పుస్తకం. నిజానికి తెలుగేదో సంస్కృతమేదో తెలియనంతగా కలిసిపోయిన పదాల గురించి చదివినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఇది కూడా శబ్దరత్నాకరంలో సంస్కృ తంగా గుర్తించిన పదజాలానికి వివరణే. అయితే వీటిలో కొన్ని యథాతథంగా ఉండగా మరికొన్ని సం యుక్తాలుగా, ద్విత్వాలుగా మారి, ఇంకొన్ని ఒత్తక్షరాలు పోయి, కొన్ని సమాసాలుగా రూపొందినాయని గుర్తించారు. వర్ణ సమీకరణ, వర్ణ లోప, వర్ణాదేశాదులతో తెలంగాణీకరించుకున్న పదాలు అనేకం గుర్తించి వివరించారు. కొన్ని పదాలకు అర్థ సంకోచ, వ్యాకోచ, విస్తృత, విపరిణామాల వలన మార్పు చెందిన తీరును గుర్తించి ఉదహరించారు. ఆ కోవలో అపేక్ష ఆపచ్చన, అగ్ని అగ్గి, ప్రజ్ఞ పెగ్గె, నిబద్ధం నివద్దె, అస్త్రం అతారె, ఆదిత్యవారం అయితారం, పదిలం పయిలం, ఈళిక ఈల పీట, శివం సిగం, ఏకాదశి యాకాశి, ప్రగ్రహం పగ్గం... ఇలా రూపొందాయని అనేక పదాలకు సముచిత ఉదాహరణలు ఇచ్చారు.  


‘తెలంగాణ భాష - తమిళ పదాలు’ పుస్తకంలో, తమిళ భాషలో ఉన్న కొన్ని వందల పదాలు తెలంగాణ ప్రజల నోటి భాషకు, వ్యవహారానికి దగ్గరగా ఉన్నవని గుర్తించారు. తమిళంలో ఉన్న పదానికి గల సామీప్యతను, అర్థ పరిణామాన్ని, పద పరిణామాన్ని సరళంగా చెప్పారు. తెలంగాణలో ఇంటికి వచ్చిన చుట్టాల పట్ల చూపే మర్యాదను ‘అర్సుకునుడు’ అంటారు. దీనికి మూలం తమిళంలోని ‘అఱిదల్‌’ అని, దానికి ఉన్న విచారించు, తెలుసుకొను మొదలైన అర్థాల పరిణామమేనని గుర్తించారు. ఱకారం కూడా సాధువుగా మారిందన్నారు. దీనికి సాక్ష్యంగా మహాభారత ఉద్యోగ పర్వ తృతీయాశ్వాసంలోని ‘సిరినాకే లందునే గ్రాసవాసో దైన్యంబులు వచ్చు నా యరయు నీ చుట్టాలకున్‌’ అనే ప్రయోగం కూడా కనిపిస్తుంది. తమిళంలోని ‘అఱై’లోని ‘ఱ’కారం కూడా సాధువుగా మారి ‘అర్ర’ కావడాన్ని కూడా చూపారు. ‘ఏనుకునుడు’ అంటే విత్తిన గింజ, నాటిన మొక్క వేళ్ళూనుకొని నిలదొక్కు కోవడం దీనికి మాతృక లాంటి ‘ఈనుదల్‌’ తమిళంలో ఉన్నదని చూపారు. అవి, ఇవి, ఏవి అనేవి సర్వనామ బహువచనాలు. వీటికి తమిళంలో సమానంగా అవై, ఇవై, ఎవై అని ఉన్నాయని, కానీ, తెలంగాణలో అవ్వి, ఇవ్వి, ఇవ్వి అని వ్యవహరింపబడుతున్నాయంటారు. అట్లాగే, ద్వితీయా ప్రత్యయం చేరినప్పుడు తమిళంలో ‘అవటై్ట్రగళై, ఇవటై్ట్రగళై, ఎవటై్ట్రగళై’ అనే వాటికి సమానంగా తెలం గాణలో అవ్వీటిని, ఇవ్వీటిని, ఎవ్వీటిని వంటి మార్పు పొందాయని, ఇతర తెలుగు ప్రాంతాల్లో ‘వాటిని’ మొద లైన రూపాలే ఉన్నాయని వివరించారు. ఒర్రుడు అనే మాటకు ఉళఱల్‌ మాతృకగా ఒర్లుడు, ఒర్రుడు వంటి మాటలు ఏర్పడ్డాయని తెలుసుకోగలుగుతాం. రుద్రాక్షం తమిళంలో ఉరుద్దిరాక్కం కాగా తెలంగాణలో ఉద్రాక్ష అని ఉండడం, ఉఱుక్కుదల్‌ అనేది తెలంగాణలో ఉరుకుగా ఉండడం అర్థంలోనూ రూపంలోనూ ఉన్న దగ్గరితనాన్ని తెలుపుతుంది. ద్వంద్వ సమాసాల్లో బహువచన లోపం దక్షిణ ద్రావిడ లక్షణం కాగా తెలంగాణలో కాయగూర, తల్లిదండ్రి, మాయమంత్రంలాంటి ప్రయోగాలు కనిపిస్తున్నా యని చూపారు. తెలుగు మధ్య ద్రావిడ భాష ఐనప్ప టికీ, మూల ద్రావిడ లక్షణాలు ఎక్కువగా ఉన్న దక్షిణ ద్రావిడ భాషైన తమిళంలోని పదాలకు సమీప మార్పులు కనిపిస్తున్నాయని అనేక ఉదాహరణలు చూపారు. 


భాస్కర్‌ పద్నాలుగు భారతీయ భాషలను స్వయంకృషితో నేర్చుకున్నారు. ద్రావిడ భాషలలో పరిశోధనతో పాటు ఇతర భాషలలోని విశిష్ట రచనలకు అనువాదాలు కూడా చేశారు. అనేక భాషల సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు నుండి అనేక భాషలలోకి అనువాదాలు చేశారు. అనువాదాల గురించి అనేక భాషల అధ్యయనం చేసి, అనుసృజన చేయడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలకు పుష్టిని, ప్రాచుర్యాన్ని కలిగించారు. తెలంగాణ భాష పట్ల ఉన్న అపోహలను దూరం చేశారు. మారుమూలల్లో ఉన్న పదాల తెలుగుదనం గురించిరాయడం ద్వారా భాషా గౌరవాన్ని ఇనుమడింపజేశారు. సులభ రీతిలో రాయడం ద్వారా భాషాభిమానులకు, పరిశోధకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు.

బూర్ల వేంకటేశ్వర్లు, 94915 98040

Updated Date - 2020-12-28T10:28:25+05:30 IST