మాజీ సైనికుల సంక్షేమానికి నిరంతర కృషి
ABN , First Publish Date - 2021-07-27T07:03:00+05:30 IST
మాజీ సైనికుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి తమవంతుగా నిరంతరం కృషి చేస్తామని మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంది పాపిరెడ్డి అన్నారు.
మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పాపిరెడ్డి
నల్లగొండ క్రైం/ నకిరేకల్/ త్రిపురారం, జూలై 26: మాజీ సైనికుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి తమవంతుగా నిరంతరం కృషి చేస్తామని మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంది పాపిరెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో విధి నిర్వహ ణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు. కార్డిల్ యుద్ద వీరుల త్యాగం మరువరానిదని టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవం సందర్భంగా నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మాజీ సైనికులను ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గాజుల సుకన్య, దైద స్వప్న పాల్గొన్నారు. త్రిపురారం మండలంలోని కొణతాలపల్లిలో కార్గిల్ పోరులో అసువులు బాసిన లాన్స్నాయక్ శ్రీనివాస్రెడ్డి విగ్రహానికి బీజేపీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మల్లికార్జున్, నర్సింహ, సర్పంచ్ జొన్నలగడ్డ వెంకట్రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.