కరోనా అంతమయ్యేవరకూ కొవిడ్ కేర్ సెంటర్లు కొనసాగింపు
ABN , First Publish Date - 2021-06-22T05:59:31+05:30 IST
కరోనా బాధితులను కాపాడేందుకు సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కొవిడ్ కేర్ సెంటర్లను కరోనా అంతమయ్యే వరకూ కొనసాగిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
విశాఖపట్నం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులను కాపాడేందుకు సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కొవిడ్ కేర్ సెంటర్లను కరోనా అంతమయ్యే వరకూ కొనసాగిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. సోమవారం విశాఖ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన నడుస్తున్న కొవిడ్ కేర్ ఐసోలేషన్ సెంటర్ను సందర్శించారు. సెంటర్లో చికిత్స పొందుతున్న 11 మంది బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖలో పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల సభ్యులు సేవా కార్యక్రమాలలో చురుగ్గాపాల్గొంటున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ను, కరోనా నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మధు దుయ్యబట్టారు. విశాఖతోపాటు అరకు, ముంచంగిపుట్టులో సీపీఎం ఆధ్వర్యంలో కొవిడ్ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నట్టు పార్టీ నగర కార్యదర్శి బి.గంగారావు వివరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.నరసింగరావు, జి.కోటేశ్వరరావు, జాషువా సాంస్కృతిక కేంద్రం ప్రతినిధి సుబ్బారెడ్డి, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రతినిధి యువీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.