కోర్టు ధిక్కరణ కేసులకు.. ప్రభుత్వ వ్యయమా?

ABN , First Publish Date - 2022-07-19T09:30:51+05:30 IST

కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వాధికారుల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయానికి చెందిన ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు ధిక్కరణ కేసులకు.. ప్రభుత్వ వ్యయమా?

  • ప్రైవేటు న్యాయవాదులను నియమించుకోవాలి
  • ప్రభుత్వ లాయర్ల  హాజరుపై హైకోర్టు ఆగ్రహం


హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వాధికారుల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయానికి చెందిన ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో సొంత ఖర్చులతో న్యాయవాదులను నియమించుకోవాలని స్పష్టం చేసింది. ఓ కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ‘‘అధికారుల ధిక్కరణ కేసులకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తారా?’’ అని ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమిని సేకరించి.. నాలుగేళ్లుగా పరిహారం చెల్లించడం లేదంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నాగాహిల్స్‌లోని సర్వే నంబర్‌ 66లో ఉన్న 276 చదరపు గజాల ప్లాట్‌ విషయంలో ఆ భూమి యజమాని మహమ్మద్‌ ఖాజం అలీ కోర్టులో ధిక్కరణ పిటిషన్‌ వేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ భూమి వివాదాస్పదమైనదని చెప్పడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


 భూసేకరణ చేసి.. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక.. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ వెంకన్న కొవిడ్‌ కారణంగా విచారణకు హాజరుకాలేక పోయారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల తరఫున ఏజీ కార్యాలయం ప్రాతినిధ్యం వహించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదంలో ఉన్న భూమి గవర్నమెంట్‌ స్థలమని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. అయితే భూసేకరణ ఎందుకు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులో భూమి టైటిల్‌ను తేల్చడం తమ పనికాదని.. పరిహారం అందిందా? లేదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టంచేసింది. పిటిషనర్‌కు చెల్లించాల్సిన పరిహారంలో 50ు కోర్టులో డిపాజిట్‌ చేయాలని ఆదేశాలిచ్చింది. 

Updated Date - 2022-07-19T09:30:51+05:30 IST