జీవీఎంసీ పూర్వ కమిషనర్హరినారాయణ్కు శిక్ష ఖరారు
3 నెలల జైలు, 2 వేలు జరిమానా
అప్పీలుకు వీలుగా 6 వారాలు నిలిపివేత
తీర్పు చెప్పిన జస్టిస్ బట్టు దేవానంద్
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వీధి వ్యాపారులను ఖాళీ చేయించిన వ్యవహారంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) పూర్వకమిషనర్ ఎం. హరినారాయణ్కు హైకోర్టు మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ సోమశేఖర్, గాజువాక మాజీ ఎమ్మెల్యే పి. శ్రీనివా్సపై కోర్టు ధిక్కరణ కేసు మూసివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు ఇచ్చారు. హరినారాయణ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు అప్పీల్ వేసుకొనేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్ చేశారు. అప్పీల్ దాఖలు చేయడంలో విఫలమైనా, అప్పీల్పై ధర్మాసనం స్టే విధించకపోయినా జూన్ 16న సాయంత్రం 5 గంటలులోగా రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ముందు సరెండర్ కావాలని ఎం.హరినారాయణ్ను ఆదేశించారు.
పూర్వాపరాలు ఇవీ..
విశాఖపట్నంలోని పెదగంట్యాడ జంక్షన్ వద్ద బీసీ రోడ్డులో తమ సంఘం సభ్యుల నిర్వహిస్తున్న 70 షాపులను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారని పే ర్కొంటూ శ్రీపెంటమాంబ గ్రామదేవత ఆర్.హెచ్. కాలనీ, పెదగంట్యాడ కాయగూరలు మరి యు చిల్లర వ్యాపారాల సంఘం ఉపాధ్యక్షురాలు కె.కౌసల్య 2017 లో హైకోర్టును ఆశ్రయించారు. స్ట్రీట్ వెండార్ చట్టం 2014 మేరకు కార్పొరేషన్ తమకు వెండార్ కార్డులు జారీ చేసిందని, ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నామని అందులో పేర్కొన్నారు. తమను ఖాళీ చేయిస్తే జీవనోపాధి కోల్పోతామని, అధికారులను నిలువరించాలని కోరారు.
ఆ వ్యాజ్యాన్ని విచారించిన కో ర్టు చట్ట నిబంధనలు అనుసరించకుండా పిటిషనర్ సంఘం విషయంలో జోక్యం చేసుకోవద్ద ని జీవీఎంసీ అధికారులను 2017 జూన్ 21న ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. 2018 జనవరి 29న ఉదయం 10 గంటల సమయంలో జీవీఎంసీ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వచ్చి చిల్లర దుకాణాలను, బడ్డీ కొట్లను తొలగించారని పేర్కొంటూ ధిక్కరణ వ్యాజ్యం వేశారు. పిటిషనర్ సంఘం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నిబంధనల మేరకు అధికారులు నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో షాపులు తొలగించాలని కోరారు. తమకు ఆ చట్టం వర్తించదని, స్ట్రీట్ వెండార్ చట్టం 2014 పరిధిలోకి వస్తామని సంఘం వివరణ ఇచ్చింది. ఆ వివరణ పరిగణలోకి తీసుకోకుండా అధికారులు చిల్లర షాపులను ద్వంసం చేశారు’’ అని తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కౌంటర్ దాఖలు చేస్తూ... ‘‘పిటిషనర్లు రోడ్డు మార్జిన్ను ఆక్రమించి షా పులు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేశాం. కోర్టు ఆదేశాలను ఉ ల్లంఘించలేదు’’ అని తెలిపారు. ఇరువైపుల వా దనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బట్టు దేవానంద్.. ‘‘స్ట్రీట్ వెండార్ చట్టం-2014 మేరకు కార్పొరేషన్ పిటిషనర్లకు స్ట్రీట్ వెండార్ కార్డులు జారీ చేసింది. ఆ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం షాపులు వేరే ప్రాంతానికి తరలించడానికి లేదా తొలగించడానికి 30 రోజుల ముందు వారికి నోటీసులు జారీ చేయడం తప్పనిసరి. అధికారులు నోటీసులు ఇవ్వలేదు. కోర్టు ఆదేశాల మే రకు చట్ట నిబంధనలు పాటించకుండా అధికారులు షాపులు తొలగించారు. ఈ నేపథ్యంలో షాపులను తొలగించడం కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. దీనికి జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ను బాధ్యుడి గా తేలుస్తూ ఆయనకు శిక్ష ఖరారు చేశారు.