సోమల జయంతి కాలనీలో తాగునీటి కలుషితం?
ABN , First Publish Date - 2021-12-09T05:57:20+05:30 IST
సోమల జయంతి కాలనీలో బుధవారం ఉదయం నుంచి 23 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలతో 23 మందికి అస్వస్థత
సోమల, డిసెంబరు 8: సోమల జయంతి కాలనీలో బుధవారం ఉదయం నుంచి 23 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధితులను అధికారులు చికిత్స నిమిత్తం పీలేరు, తిరుపతి, సదుం వైద్యశాలలకు తరలించారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్వో శ్రీహరి, డిప్యూటీ డీఎంహెచ్వో లక్ష్మి సోమల జయంతి కాలనీకి చేరుకుని గ్రామంలో పర్యటించి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 15 మందిని సోమల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యసేవలు అందించారు. గ్రామానికి చెందిన ధనుంజయ(25)ను తిరుపతికి, నాగరాజమ్మ(51), సిద్ధమ్మ(48), జైపాల్ (50), మునిరత్నం (40), వి.కృష్ణయ్య(65), ఎం.బాబురావు(2), హర్షవర్ధన్(14), సాయి(5)లను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మిగిలిన వారిని సోమల, సదుం వైద్యశాలలో చేర్పించారు. తహసీల్దార్ శ్యాంప్రసాద్రెడ్డి, ఎంపీడీవో నాగరాజ, ఎస్ఐ లక్ష్మీకాంత్, ఎంపీపీ ఈశ్వరయ్య, జడ్పీటీసీ కుసుమామోహన్, ఏఎంసీ చైర్మన్ అరుణానాగేశ్వరరావు, వైస్ఎంపీపీ ప్రభాకర్, సర్పంచ్ రాజేశ్వరి జయంతి కాలనీని సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. కాగా గ్రామానికి ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్లైన్ లీకేజీతో తాగునీరు కలుషితమై ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా అధికారులు నీటి శాంపిల్స్ను పరీక్షించారు. రిపోర్టు వస్తే విషయం ఏంటో తెలిసే అవకాశం ఉంది.