గ్యాస్ కోసం వినియోగదారుల తిప్పలు
ABN , First Publish Date - 2021-05-13T05:19:41+05:30 IST
నగరంలో గ్యాస్ డెలివరీ చేసే బాయ్లకు కరోనా సోకడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి): నగరంలో గ్యాస్ డెలివరీ చేసే బాయ్లకు కరోనా సోకడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బాయ్ తన పరిధిలో రోజుకు 100 వరకు సిలిండర్లు డెలివరీ ఇస్తారు. ఒక్కో ఏజెన్సీ వద్ద నలుగురి నుంచి ఆరుగురు వరకు బాయ్స్ ఉన్నారు. వారిలో ఒకరు లేదా ఇద్దరికి కరోనా వస్తే.. మిగిలిన వారు డెలివరీ బాధ్యతలు తీసుకుంటున్నారు. సాధారణంగా నగరంలో సిలిండర్ బుక్ చేసుకున్న మరుసటి రోజే డెలివరీ ఇస్తారు. ప్రస్తుతం అలా జరగడం లేదు. రెండు నుంచి మూడు రోజులు పడుతోంది. కొన్ని ఏజెన్సీల్లో బాయ్స్ అందరికీ కరోనా సోకడంతో డీలర్ సరఫరా విషయంలో చేతులెత్తేస్తున్నారు. అత్యవసరం అయితే, ఏజెన్సీ వద్దకే వచ్చి సిలిండర్ తీసుకెళ్లాలని చెబుతున్నారు. నగరంలో చాలా మందికి గ్యాస్ గొడౌన్లు కూడా లేవు. రోడ్డు పక్కనే వ్యాన్ ఆపి, అక్కడే డెలివరీ ఇస్తున్నారు. ధర్మానగర్లోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో ఇటువంటి సమస్యే ఏర్పడింది. అందులో పనిచేసే నలుగురు బాయ్స్కి కరోనా సోకడంతో సిలిండర్ల సరఫరా నిలిచిపోయిది. దాంతో వినియోగదారులే ఖాళీ సిలిండర్తో వచ్చి తీసుకెళుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రవాణా చార్జీలు డీలర్ తీసుకోకూడదు. సుమారుగా రూ.30 వరకు తగ్గించి బిల్లు ఇవ్వాలి.