బిల్లలు చెల్లించక.. పనులు పూర్తికాక
ABN , First Publish Date - 2021-10-03T05:00:53+05:30 IST
బిల్లలు చెల్లించక.. పనులు పూర్తికాక
- నత్తనడకన వైఎస్సార్ హెల్త్క్లినిక్ల నిర్మాణం
- 685 క్లినిక్లకు 28 భవనాలు మాత్రమే పూర్తి
(ఇచ్ఛాపురం)
పల్లె ప్రజల ముంగిటకే వైద్యసేవలు అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. జిల్లాలో 685 హెల్త్క్లినిక్ల ఏర్పాటు కోసం రూ120.84 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో 685 హెల్త్క్లినిక్లకు గానూ ఇప్పటివరకు 28 మాత్రమే పూర్తయ్యాయి. మరో 157 భవనాలు 90శాతం, 148 భవనాలు శ్లాబ్లెవల్, 321 భవనాలు బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. 31 క్లినిక్ల భవన నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. క్లినిక్ల నిర్మాణానికి రూ120.84.కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.16 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా సుమారు కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగుతాయని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హెల్త్క్లినిక్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పంచాయతీరాజ్ ఎస్ఈ వీరంనాయుడు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, హెల్త్క్లినిక్ భవనాల పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బిల్లులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. త్వరలో బిల్లులు చెల్లించి.. పనులు వేగవంతం చేస్తామని వివరించారు.