బద్దిపడగ జేపీతండా మార్గాల మధ్య కాజ్వే నిర్మాణం
ABN , First Publish Date - 2022-08-09T05:05:15+05:30 IST
నంగునూరు మండలం బద్దిపడగ నుంచి జేపీతండా రైతుల సుదీర్ఘకాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.
రూ.60 లక్షల నిధులు మంజూరు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం
నంగునూరు, ఆగస్టు 8: నంగునూరు మండలం బద్దిపడగ నుంచి జేపీతండా రైతుల సుదీర్ఘకాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో బద్దిపడగ నుంచి జేపీతండాకు వెళ్లే మార్గంలో కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.60 లక్షల నిధులను మంజూరు చేసింది. త్వరలో కాజ్వే నిర్మాణ పనులు ప్రారంభం కానుండడంతో రైతుల కష్టాలు తొలగిపోనున్నాయి. అయితే రెండు గ్రామాల మధ్య దూరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. రైతుల వ్యవసాయ బావులకు, అలాగే జేపీతండా, దర్గపల్లి గ్రామాలకు వెళ్లేందుకు దూరం తగ్గుతుందన్నారు. నిధుల మంజూరుకు కృషిచేసిన జడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.