ఉద్యోగం ఇప్పిస్తానని..స్నేహితుడిని మోసం చేసిన కానిస్టేబుల్
ABN , First Publish Date - 2020-07-03T09:53:07+05:30 IST
ఉద్యోగం ఇప్పిస్తానని స్నేహితుడి వద్ద డబ్బు తీసుకొని మోసానికి పాల్పడ్డాడు ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.
బంజారాహిల్స్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగం ఇప్పిస్తానని స్నేహితుడి వద్ద డబ్బు తీసుకొని మోసానికి పాల్పడ్డాడు ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. నెల్లూరు జిల్లాకు చెందిన మందడి అభినవరెడ్డి, మహేష్ స్నేహితులు. ఇద్దరూ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులపాటు కలుసుకోలేదు. 2018లో నగరానికి వచ్చిన అభినవరెడ్డిని మహేష్ కలిశాడు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని మహేష్ అభినవరెడ్డికి చెప్పాడు. ఇందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో డబ్బు ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా మహేష్ స్పందించలేదు. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.