రాజుకు కనువిప్పు

ABN , First Publish Date - 2021-06-18T09:34:44+05:30 IST

చాలా ఏళ్ళ క్రితం... బాగ్దాద్‌ను పాలిస్తున్న హరున్‌ అల్‌ రషీద్‌ ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆయన మంత్రులు, సైనికాధికారులు విందులో పాల్గొన్నారు. రాజు తన సింహాసనం మీద కుర్చొని దర్జాగా మద్యాన్ని సేవిస్తున్నాడు.

రాజుకు కనువిప్పు

చాలా ఏళ్ళ క్రితం... బాగ్దాద్‌ను పాలిస్తున్న హరున్‌ అల్‌ రషీద్‌ ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆయన మంత్రులు, సైనికాధికారులు విందులో పాల్గొన్నారు. రాజు తన సింహాసనం మీద కుర్చొని దర్జాగా మద్యాన్ని సేవిస్తున్నాడు. 

అంతలో బహలూల్‌ దానా అనే పండితుడు రాజదర్బార్‌లో ప్రవేశించారు. ఆయనను చూడగానే రాజు తడబాటుకు గురయ్యాడు. ‘మద్యపానం నిషిద్ధం’ అని ఆ పండితుడు పదేపదే చేసిన బోధను పెడచెవిన పెట్టినందుకు రాజు లోలోపలే సిగ్గుపడసాగాడు. అయితే, మద్యం మత్తులో... తన తప్పును కప్పి పుచ్చుకోవాలన్న ఆలోచన అతనికి వచ్చింది.


‘‘గురువుగారూ! నాదో సందేహం’’ అన్నాడు రాజు. 

‘‘నిస్సందేహంగా అడగవచ్చు’’ అన్నారు గురువు.

‘‘ద్రాక్ష పండ్లు తినడం పాపమా?’’

‘‘లేదు... నిస్సంకోచంగా తినవచ్చు.’’

‘‘ద్రాక్ష పండ్లు తిన్నాక నీరు తాగడం నిషిద్ధమా?’’

‘‘లేదు. నిస్సంకోచంగా తాగవచ్చు.’’


‘‘మరి ద్రాక్ష పండ్లు తిని, మంచి నీరు తాగి, ఆ తరువాత ఎండలో కాసేపు నిలబడితే తప్పేమిటి?’’ అని అడిగాడు రాజు.

‘‘తప్పేమీ లేదు. ఎంతసేపైనా నిలబడవచ్చు’’ అన్నారు గురువు.

‘‘గురువర్యా! ద్రాక్ష గుత్తులను నీళ్ళలో కలిపి, ఎండలో ఎండబెట్టి... తయారు చేసిన పానీయాన్ని తాగడం ఎలా నిషిద్ధమో మీరే చెప్పండి’’ అని తాగిన మైకంలో, గర్వాతిశయంతో... నిలదీస్తున్నట్టు అడిగాడు రాజు.

దానికి తగినట్టుగానే సమాధానం ఇవ్వాలనుకున్నారు బహలూల్‌ దానా. రాజుకు కొన్ని ప్రశ్నలు సంధించారు.

‘‘రాజా! ఎవరి నెత్తిమీదనైనా దోసిళ్ళతో మట్టి గుమ్మరిస్తే నష్టమా?’’ అని అడిగారు.

‘‘అబ్బే! నష్టమేం ఉండదు’’ అన్నాడు రాజు.

‘‘అదే తలపై నీళ్ళను గుమ్మరిస్తే బాధ కలుగుతుందా?’’

‘‘లేదు... లేదు.’’


‘‘ఆ మట్టిని నీళ్ళతో కలిపి, ఒక ఇటుకను తయారు చేసి, ఎండబెట్టి... తలపై మోదితే ఏమైనా నష్టమా?’’

‘‘గురూజీ! మీరేమిటి వింతగా మాట్లాడుతున్నారు? ఇటుకతో తలపై మోదితే గాయం అవదూ? ప్రాణహాని కూడా జరగవచ్చు’’ అన్నాడు రాజు.

‘‘మట్టి, నీరు కలిపి, ఎండబెట్టి, తయారు చేసిన ఇటుకకు తలను పగులగొట్టే శక్తి ఎలా ఉంటుందో, ద్రాక్ష పండ్లనూ, నీటినీ కలిపి, వండి వార్చిన పానీయానికి మత్తెక్కించే శక్తికూడా అలాగే ఉంటుంది. ఆ అపరిశుద్ధమైన పానీయాన్ని సేవించడం వల్ల బుద్ధి క్షీణిస్తుంది. తాగిన మైకంలో ఎంతటి పాపానికైనా, మరెంతటి అఘాయిత్యానికైనా మనిషి ఒడిగడతాడు. అందుకే మద్యపానాన్ని అల్లాహ్‌ నిషేధించారు’’ అని చెప్పి రాజు కళ్ళు తెరిపించారు బహలూల్‌ దానా.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-06-18T09:34:44+05:30 IST