జైలు సిబ్బందికి సుకేష్ చంద్రశేఖర్ రూ.కోట్లలో లంచాలు : Delhi Police

ABN , First Publish Date - 2022-07-10T19:52:15+05:30 IST

అనేక మందిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్

జైలు సిబ్బందికి సుకేష్ చంద్రశేఖర్ రూ.కోట్లలో లంచాలు : Delhi Police

న్యూఢిల్లీ : అనేక మందిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని రోహిణి జైలు సిబ్బందికి కోట్లాది రూపాయల లంచం ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. జైలులో నిర్బంధంలో ఉంటూనే ఆయన చట్ట వ్యతిరేక వ్యాపారం చేసినట్లు తెలిపారు. జైలు బయట ఉన్న ఆయన సహచరులతో మాట్లాడేందుకు ఆయనకు మొబైల్ ఫోన్లు, ఇతర సదుపాయాలను జైలు సిబ్బంది కల్పించారని చెప్పారు. ఈ నేపథ్యంలో 81 మంది జైలు అధికారులపై కేసును నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం ప్రకటించింది. 


సుకేష్ నుంచి 81 మంది జైలు అధికారులు లంచాలు తీసుకున్నట్లు ఆరోపించింది. జైలుకు సంబంధించిన ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సింగ్ సిబ్బంది సహకారంతో సుకేష్ తన సన్నిహితులతోనూ, ఇతరులతోనూ మాట్లాడుతున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 


సుకేష్ చంద్రశేఖర్ అనేక మందిని మోసగించినట్లు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అత్యంత ప్రముఖులు కూడా ఆయన బాధితుల్లో ఉన్నారు. వీరందరి నుంచి ఆయన కోట్లాది రూపాయలను అక్రమంగా స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఢిల్లీలోని తిహార్ జైలులో నిర్బంధించారు. జైలులో ఉంటూనే అక్రమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, జైలు సిబ్బందికి గత రెండేళ్ళలో రూ.12.5 కోట్ల మేరకు లంచాలు ఇచ్చారని తాజాగా పోలీసులు ఆరోపిస్తున్నారు. 


అయితే తిహార్ జైలు సిబ్బంది తన నుంచి గడచిన రెండేళ్ళలో రూ.12.5 కోట్లు లాక్కున్నారని సుకేష్ ఆరోపిస్తున్నారు. సుకేష్, ఆయన భార్య గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుకేష్‌ను చంపుతామని జైలు సిబ్బంది బెదిరిస్తున్నారని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2022-07-10T19:52:15+05:30 IST