యూఎస్ కాంగ్రెస్లో.. భారత్కు సాయం వేగవంతం చేసే తీర్మానం
ABN , First Publish Date - 2021-05-18T15:01:42+05:30 IST
కరోనాతో అతలాకుతలమవుతున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేస్తూ ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహమ్మారిపై పోరులో భారత్కు అందిస్తున్న సాయాన్ని వేగవంతం చేయాలంటూ జో బైడెన్ ప్రభుత్వాన్ని అక్కడి చట్టసభ్యులు కోరారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేస్తూ ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహమ్మారిపై పోరులో భారత్కు అందిస్తున్న సాయాన్ని వేగవంతం చేయాలంటూ జో బైడెన్ ప్రభుత్వాన్ని అక్కడి చట్టసభ్యులు కోరారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యులు బ్రాడ్ షెర్మన్, స్టీవ్ ఛాబట్ రూపొందించారు. భారత్కు అదనంగా అత్యవసరమైన వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, టీకాల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల సరఫరా, కొవిడ్ టెస్ట్ కిట్లు, క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు అందించాలని తీర్మానంలో పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి కట్టడిలో భారత ప్రజలకు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ సభ్యులు తీర్మానించారు. విపత్కర పరిస్థితుల్లో భారత్కు అగ్రరాజ్యం అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఆరోగ్య రంగంలో భారత్తో అమెరికాకు ఏడు దశాబ్దాల బంధం ఉందని ఈ సందర్భంగా ప్రతినిధుల సభ గుర్తు చేసింది. ఈ కష్ట సమయంలో అటు అమెరికా ప్రైవేట్ సెక్టార్ కూడా భారత్కు చేదోడుగా నిలవడం ప్రశంసనీయం అన్నారు కాంగ్రెస్ సభ్యులు. 1000 వెంటిలేటర్లు, 25వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఏర్పాట్లు చేయడం చాలా మంచి విషయంగా చట్ట సభ్యులు పేర్కొన్నారు. భారత్ త్వరగా మహమ్మారిని జయించేందుకు ప్రపంచ దేశాలు తమవంతు సాయంగా వైద్య సామాగ్రిని పంపిస్తుండడం కూడా మంచి పరిణామంగా ప్రతినిధులు తెలిపారు. అలాగే అమెరికా కరోనాతో పోరాడుతున్న సమయంలో భారత్ అందించిన సహాయాన్ని కూడా ఈ సందర్భంగా చట్ట సభ్యులు గుర్తు చేశారు.