మేడమ్... మీరే బాధ్యతలు మోయండి : సీడబ్ల్యూసీ

ABN , First Publish Date - 2020-07-09T20:57:47+05:30 IST

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా తిరిగి సోనియా గాంధీనే కొనసాగమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరే

మేడమ్... మీరే బాధ్యతలు మోయండి : సీడబ్ల్యూసీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా తిరిగి సోనియా గాంధీనే కొనసాగమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరే అవకాశముందని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఓ సంవత్సరం నుంచి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అత్యున్నత కమిటీ అయిన సీడబ్ల్యూసీ త్వరలోనే భేటీ కానున్నట్లు సమాచారం.


పూర్తి కాలపు అధ్యక్షుడ్ని ఇంకా ఎన్నుకోలేదు కాబట్టి, పార్టీ రాజ్యాంగం ప్రకారం పొడగింపు అనేది సాంకేతిక అవసరమని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ 19తో పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో నూతన అధ్యక్షుడి ఎంపిక సాధ్యం కాదని, సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగమని సీడబ్ల్యూసీ కోరుతుందని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. 


గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేకుండానే గడిచిపోయింది. గాంధీయేతర కుటుంబం వారికి అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారమూ బలంగానే జరిగింది. తర్వాత సోనియా గాంధీకే తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యతను కట్టబెడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-07-09T20:57:47+05:30 IST