ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ అమలులో వైఫల్యాలపై కాంగ్రెస్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-02-02T20:18:32+05:30 IST

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో

ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ అమలులో వైఫల్యాలపై కాంగ్రెస్ ఆగ్రహం

న్యూఢిల్లీ : ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు బుధవారం జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని బీజేపీ చెప్పిందని, ఇప్పటికి 15 కోట్ల ఉద్యోగాలను ఇచ్చి ఉండవలసిందని చెప్పారు. వాస్తవంగా నేటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రానున్న ఐదేళ్ళలో 60 లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం సమస్య తీవ్రంగా ఉందన్నారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడులు రాకపోవడం, ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాల వల్ల యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని చెప్పారు. 


పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 31న మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత దేశం ఒకటి అని చెప్పారు. 2047 నాటికి అద్భుతమైన, ఆధునిక, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించడం కోసం ప్రజలు గట్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2047లో భారత దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుందన్నారు. మనం గట్టిగా శ్రమించి కృషి చేయాలని, తద్వారా సత్ఫలితాలు వచ్చేలా జాగ్రత్తవహించాలని తెలిపారు. ఈ ప్రస్థానంలో మనందరికీ సమాన భాగస్వామ్యం ఉందన్నారు. 


అంతరాయాలు కలవరపరుస్తున్నాయి : వెంకయ్య నాయుడు 

బడ్జెట్ సమావేశాల్లో సభ కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. భారత దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజలకుగల నమ్మకానికి తగినట్లుగా సభ్యులు ప్రవర్తించాలని కోరారు. 


Updated Date - 2022-02-02T20:18:32+05:30 IST