తప్పుడు ప్రతిష్టకు పోయి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
ABN , First Publish Date - 2021-05-18T18:47:25+05:30 IST
కోవిడ్ వ్యాక్సిన్ విధానంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు ..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ విధానంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు మరోసారి విమర్శలు గుప్పించింది. భారతీయుల ప్రాణాలను పణంగా పెట్టి 'తప్పడు ఇమేజ్' కోసం ప్రభుత్వం పాకులాడిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీ ఓ ట్వీట్లో ఆరోపించారు. సొంత ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్ కంటే ఎక్కువ వ్యాక్సిన్ను భారత్ ఎగుమతి చేసిందంటూ ఆమెరికాలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి పేర్కొన్న వీడియోను ఆయన ట్వీట్కు జోడించారు. భారతీయుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్డీయే/బీజేపీ తప్పుడు ఇమేజ్ కోసం పాకులాడవద్దని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్కు తాను లోక్సభలో హెచ్చరించినట్టు తివారీ పేర్కొన్నారు.
కేంద్రం వ్యాక్సిన్ పాలసీపై రాహుల్ సైతం వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు దేశంలో వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుంటే మరోవైపు విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులేంటని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుంటే, వ్యాక్సిన్ల కొరత కూడా అదే స్ధాయిలో పెరుగుతోందని రాహుల్ తెలిపారు. దేశ ప్రజల్ని రిస్క్లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తారా అని రాహుల్ ప్రధాని మోడీని ప్రశ్నించారు.