ఢిల్లీ అల్లర్ల ఛార్జిషీట్ లో సల్మాన్ ఖుర్షీద్, బృందా కారత్ పేర్లు

ABN , First Publish Date - 2020-09-24T17:32:05+05:30 IST

ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పేరును ఢిల్లీ పోలీసులు చేర్చారు.

ఢిల్లీ అల్లర్ల ఛార్జిషీట్ లో సల్మాన్ ఖుర్షీద్, బృందా కారత్ పేర్లు

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పేరును ఢిల్లీ పోలీసులు చేర్చారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు ఈ ఛార్జిషీట్‌లో ఖుర్షీద్ పేరును చేర్చినట్లు వారు తెలిపారు. ఖుర్షీద్ తో పాటు సీపీఎం నాయకురాలు, ప్రకాశ్ కారత్ భార్య బృందాకారత్ పేరును కూడా ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. ‘‘ఉమర్ ఖలీద్, సల్మాన్ ఖుర్షీద్, నదీమ్ ఖాన్... వీరందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీంతో ప్రజలు గుమిగూడారు’’ అని 17,000 పేజీలున్న ఛార్జిషీట్ లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే రెచ్చగొట్టే క్రమంలో ఏయే పదాలను వాడారన్న కచ్చితమైన సమాచారాన్ని మాత్రం పోలీసులు తెలపలేదు.


అయితే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు పేర్కొనడంతో దీనికి మరింత చట్టబద్ధత చేకూరినట్లైంది. ఈ వ్యవహారంపై సల్మాన్ ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. ‘‘మీరు చెత్తను సేకరిస్తే చాలా మలినాలే వస్తాయి. ఆ చెత్తను ఎవరికైనా ఆపాదించవచ్చు. రెచ్చగొట్టే ప్రసంగాలంటే ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నా. నేనేమైనా జోలపాట పాడేందుకు ఆ సమావేశానికి హాజరయ్యానా? ఓ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన కారణానికి హాజరయ్యానా? ఆలోచించండి. ఓ చెత్తను సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చెత్తను సేకరించే వారు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదు. చెత్తను సేకరించకండి. చెత్త నాణ్యతపై ప్రశ్నలు వేయకండి’’ అంటూ ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. 

Updated Date - 2020-09-24T17:32:05+05:30 IST