మస్తాన్వలిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
గుంటూరు, జూలై 4: నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శనకు దిగారు. పొన్నూరు రోడ్డులోని బారా ఇమాం పంజాలోనున్న మస్తాన్వలి నివాసానికి సోమవారం ఉదయమే చేరుకున్న పోలీసులు ఆయన్న హౌస్ అరెస్టు చేశారు. అనంతరం అక్కడకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ పలువురు నాయకులు మస్తాన్వలి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీతో గో బ్యాక్ గో బ్యాక్ నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలతో నిరసన తెలియజేశారు. ప్రదర్శనగా బయటకు వచ్చేందుకు ప్రయత్నంగా పోలీసులు మస్తాన్వలీ, ఎన్ఎస్యూఐ నగర అధ్యక్షుడు షేక్ కరీంను అరెస్టు చేసి లాలాపేట స్టేషన్కు తరలించి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మస్తాన్వలి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏ ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. మన్యం ప్రాంతం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తే ప్రధాని మోదీ ప్రజల ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.