ఇద్దరు రాజస్థాన్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేసిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-08-13T21:40:41+05:30 IST
అసెంబ్లీ సమావేశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కీలక అడుగులు వేసింది. తిరుగుబాటు నేతల్లోని
జైపూర్ : అసెంబ్లీ సమావేశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కీలక అడుగులు వేసింది. తిరుగుబాటు నేతల్లోని ఇద్దరు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను గురువారం కాంగ్రెస్ రద్దు చేసింది. భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ ప్రతాప్ పై విధించిన సస్పెన్షన్ను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ కీలక నేతలు ప్రకటించారు.
నిర్మాణాత్మకంగా ఆలోచించిన తర్వాతే ఈ సస్పెన్షన్ను రద్దు చేస్తున్నామని ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ అవినాశ్ పాండే ప్రకటించారు. తమ ప్రభుత్వాన్ని సచిన్ పైలట్ నేతృత్వంలో బీజేపీతో కలిసి కూల్చడానికి ప్రయత్నించారంటూ గెహ్లోత్ ప్రభుత్వం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది.
బీజేపీ ప్రకటించిన కాసేపటికే తేరుకున్న కాంగ్రెస్
అశోక్ గెహ్లోత్ సర్కారుపై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని బీజేపీ గురువారం ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన కాసేపటికే... కాంగ్రెస్ ఈ కీలక ప్రకటన చేయడం గమనించాల్సిన అంశం. మరోవైపు బలపరీక్షకు గెహ్లోత్ సిద్ధమని పరోక్ష సంకేతాలిస్తున్న నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం జరిగి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.