కాంగ్రెస్కు పూర్వవైభవం తేవాలి
ABN , First Publish Date - 2022-05-28T06:41:31+05:30 IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని పార్టీ ఏపీ రిటర్నింగ్ అధికారి అసిఫ్ అలీఖాన్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏపీ రిటర్నింగ్ అధికారి అసీఫ్ అలీ ఖాన్
చింతపల్లి, మే 27: అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని పార్టీ ఏపీ రిటర్నింగ్ అధికారి అసిఫ్ అలీఖాన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాడేరు నియెజకవర్గం ఇన్చార్జి వంతల సుబ్బారావు అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన అలీఖాన్ మాట్లాడుతూ, ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని, కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కొంత బలహీన పడిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు తీసుకుంటున్న గిరిజన వ్యతిరేక నిర్ణయాలతో ఆదివాసీల్లో మార్పు వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ను వీడి ఇతర పార్టీల్లో చేరిన కార్యకర్తలు, నాయకులు తిరిగి సొంత గూటికి చేరుతున్నారని అన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలతోపాటు అరకు ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే లక్ష్యంతో కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా రిటర్నింగ్ అధికారి ఎర్రవల్లి జాఫర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పి.శాంతకుమారి, సీనియర్ నాయకులు కంకిపాటి వీరన్నపడాల్, గురుమూర్తి, మొట్టడం బాలరాజు, బొజ్జన్న, చిరంజీవి, లకే వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.