రాహుల్పై పాశవికంగా దాడి చేస్తారా?: పోలీసులపై రేవంత్ ధ్వజం
ABN , First Publish Date - 2020-10-02T00:27:13+05:30 IST
రాహుల్ గాంధీపై యూపీ పోలీసులు పాశవికంగా దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. యూపీలో రాహుల్పై పోలీసుల
హైదరాబాద్: రాహుల్ గాంధీపై యూపీ పోలీసులు పాశవికంగా దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. యూపీలో రాహుల్పై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ రేవంత్రెడ్డి ఆందోళనకు దిగారు. గాంధీభవన్ నుంచి బీజేపీ ఆఫీసుకు ర్యాలీగా బయల్దేరారు. గాంధీభవన్ బయట రేవంత్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రేవంత్రెడ్డి మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. నాంపల్లి రోడ్డు మీద బైఠాయించి రేవంత్రెడ్డి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షంగా హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే రాహుల్ను అరెస్ట్ చేసారా? అంటూ నిలదీశారు. ఉత్తరప్రదేశ్లో అత్యంత దారుణంగా దళిత మహిళలను అత్యాచారం చేసి హత్య చేశారన్నారు. అనుమానిత మరణం జరిగినప్పుడు మృతదేహాన్ని దాచి పెట్టాలి.. కానీ అర్ధరాత్రి దహనం చేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు చూడకుండా దహనం చేశారంటే...ఎన్నో అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారం చేయొద్దన్న కనీస ధర్మాన్ని కూడా పాటించలేదని చెప్పారు. యూపీ రాష్ట్ర ప్రభుత్వం భాదిత కుటుంబానికి అండగా నిలబడలేదని.. కనీసం కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. ప్రభుత్వ ఒత్తిడితో అత్యాచారం జరగలేదని పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చారని రేవంత్రెడ్డి ఆరోపించారు.