బీజేపీ నేత కోసం తన సీటు వదులుకుంటానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-04-16T21:58:13+05:30 IST

ఈ విషయమై హరీష్ ధామి మాట్లాడుతూ ‘‘2014లో అప్పటి ముఖ్యమంత్రి హరీష్ రావత్ అభివృద్ధి చూసి నా సీటును వదులుకుంటున్నాను. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో నా సీటును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. నా నియోజకవర్గ ప్రజలు..

బీజేపీ నేత కోసం తన సీటు వదులుకుంటానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

డెహ్రడూన్: భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం తన సీటును వదులుకుంటానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోసం తన సీటు వదులుకునేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ ధామి శుక్రవారం ప్రకటించడం విశేషం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం ధామి ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయననే పార్టీ కొనసాగించింది. అయితే ఆయన ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీ సభ్యుడు కావాల్సి ఉండగా పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తమ సీటును వదులుకునేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం ముందుకు రావడం గమనార్హం.


ఈ విషయమై హరీష్ ధామి మాట్లాడుతూ ‘‘2014లో అప్పటి ముఖ్యమంత్రి హరీష్ రావత్ అభివృద్ధి చూసి నా సీటును వదులుకుంటున్నాను. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో నా సీటును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. నా నియోజకవర్గ ప్రజలు అనుమతి ఇస్తే సీఎం పుష్కర్ సింగ్ ధామికి నా సీటును ఇస్తాను’’ అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఉండడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఇంచార్జీ, అధినేతలపై పార్టీ నేతలు కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ ధామి ఏకంగా బీజేపీకి అనుకూలంగా తన సీటును వదులుకుంటానని అనడం కాంగ్రెస్‌ను మరిన్ని కష్టాల్లోకి నెట్టిందని అంటున్నారు.

Updated Date - 2022-04-16T21:58:13+05:30 IST