సార్.. బెడ్ దొరకడం లేదు
ABN , First Publish Date - 2021-05-04T08:02:49+05:30 IST
ఆస్పత్రుల్లో బెడ్లు లభించక కరోనా బాధితులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. కర్ణాటకలో స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది...
- కరోనాతో నా తల్లి పరిస్థితి విషమం..
- కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటతడి
- మాజీ సీఎం సిద్దరామయ్యకు మొర
బెంగళూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో బెడ్లు లభించక కరోనా బాధితులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. కర్ణాటకలో స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తన తల్లి పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో బెడ్ సమకూర్చుకోలేకపోతున్నానని ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి కంటతడి పెట్టారు. సోమవారం కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి మాట్లాడుతూ.. తన తల్లి కరోనా బారినపడ్డారని, పరిస్థితి విషమంగా ఉందని, హుబ్బళ్ళి మెడికల్ కళాశాల ఆస్పత్రిలో ఓ పడక సమకూర్చుకోలేక పోతున్నానని రోదించారు. వెంటనే స్పందించిన సిద్దరామయ్య.. కిమ్స్ డైరెక్టర్తో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని, చామరాజనగర్లో ఆక్సిజన్ లభించక కరోనా బాధితులు 24 మంది మృతి చెందారన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముుఖ్య నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కొవిడ్ బాధితులలో మనోధైర్యం నింపాలని, వారికి అవసరమైన సేవలు అందించాలని కోరారు.