కేసీఆర్తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ
ABN , First Publish Date - 2021-06-25T23:54:04+05:30 IST
సీఎం కేసీఆర్తో టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ వచ్చాక తొలిసారిగా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్తో టీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. కొన్నిరోజుల క్రితం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కు గురైన మరియమ్మ విషయమై సీఎంను కలిసామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మరియమ్మ లాకప్ డెత్ ఘటనను సీఎం దృష్టికి తెచ్చామని భట్టి పేర్కొన్నారు. మరియమ్మ కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని భట్టి తెలిపారు. అలాగే మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామనే హామీని కూడా సీఎం కేసీఆర్ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని కోరామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం అన్నారన్నారు. లాకప్ డెత్కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరామని భట్టి తెలిపారు.
రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని భట్టి ఆరోపించారు. 28వ తేదీలోగా మరియమ్మ కుటుంబానికి అన్నిరకాల సాయం చేసేందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రేపు డీజీపీని మరియమ్మ స్వగ్రామానికి వెళ్లాలని ఆదేశిస్తామని సీఎం తెలిపారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ను కలిసిన వారిలో భట్టి , శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి ఉన్నారు. అయితే ఈ భేటీ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది.