గల్లా పట్టి అడగటానికి గజ్వేల్ సభ
ABN , First Publish Date - 2021-09-17T02:13:49+05:30 IST
గట్టిగా నిలదీసి, గల్లా పట్టి అడగటానికి గజ్వేల్లో దళిత, గిరిజన దండోరా సభను
సిద్దిపేట: గట్టిగా నిలదీసి, గల్లా పట్టి అడగటానికి గజ్వేల్లో దళిత, గిరిజన దండోరా సభను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్యెల్యే సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను గజ్వేల్ నుంచే కేసీఆర్ను ప్రశ్నించే సమయం ఆసన్నమైందన్నారు. గజ్వేల్లో జరిగే సభను విచ్చినం చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. గట్టిగా నిలదీసి గల్లా పట్టి అడగటానికే గజ్వేల్లో సభను నిర్వహిస్తున్నామన్నారు.
మాజీ మంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ ..
కాంగ్రెస్ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో 10 వేళ ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే చిరస్థాయిలో నిలిచే విధంగా కొడకండ్లలో 400 కేవీ పవర్ సబ్ స్టేషన్ను నిర్మించామన్నారు. కొండపోచమ్మ , మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లే, గజ్వేల్లో నీకు ఓటు వేసిన ప్రజలకు ఇండ్లు ఇచ్చినవా అని కేసీఆర్ను ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పాలనలో హిట్లర్ మాదిరిగా ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తున్నావని ఆరోపించారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ..
దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ హయాంలో 500 కోట్లతో 400 కేవీ సబ్ స్టేషన్ను గజ్వేల్లో నిర్మించి ఇచ్చామన్నారు. తెలంగాణ ద్రోహులందరు టీఆర్ఎస్లోనే ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులకే మంత్రి పదవులు ఇచ్చావని కేసీఆర్పై ఆయన ధ్వజమెత్తారు. గజ్వేల్ నిర్వహించే ఈ సభ కేవలం గజ్వేల్కు సంబంధించినది కాదని, యావత్తు తెలంగాణకు చెందిన సభ అని ఆయన అన్నారు.
ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ..
రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే గజ్వేల్లో ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. దళిత బందు పేరుతో దళితుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నావని ఆయన విమర్శించారు.