Rajagopal reddy రాజీనామాపై కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే...
ABN , First Publish Date - 2022-08-08T20:28:17+05:30 IST
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopalreddy) రాజీనామా చేయడంపై కాంగ్రెస్ నేతలు (Congress leader) స్పందించారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopalreddy) రాజీనామా చేయడంపై కాంగ్రెస్ నేతలు (Congress leader) స్పందించారు. రాజగోపాల్ బీజేపీలో చేరడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మునుగోడులో గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్, జీవన్ రెడ్డి కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు.
భట్టి విక్రమార్క (Batti vikramarka) మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి రాజీనామా దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్లో గెలిచి బీజేపీలోకి వెళ్ళడం బాధాకరమన్నారు. బీజేపీలో చేరడాన్నీ ఖండిస్తున్నామన్నారు.
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే: శ్రీధర్ (Sridhar)
ఇష్టం లేకుండా పనిచేస్తున్నాం అనడం తప్పు అని శ్రీధర్ అన్నారు. మునుగోడులో గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ఎవరి సొంతం కాదు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan reddy)
కాంగ్రెస్ గోవు, బీజేపీ (BJP) పులి అని రాజగోపాల్ రెడ్డీ అన్నారని... గోమాతను అంతా పూజిస్తారు.. ఎవరైనా గోవును వదిలి పులి దగ్గరకు వెళతారా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పులి మీద స్వారీ చేస్తే ఏమీ అవుతుందో తెలియదా అని అన్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటు వేస్తారా అని అడిగారు. టీఆర్ఎస్(TRS) పెనం అయితే బీజేపీ పొయ్యి అని వ్యాఖ్యానించారు. అందరికీ కాంగ్రెస్ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. మునుగోడు తమకు సెమీ ఫైనల్స్ అని.. అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తామంతా తృప్తిగానే ఉన్నామన్నారు. కాంగ్రెస్ ఎవరి సొంతం కాదని.... పార్టీని నిలబెట్టుకుంటామని జీవన్ రెడ్డి స్పష్టంచేశారు.