V.Hanumanth rao: బీజేపీ గెలుస్తదని కొందరు కలలుకంటున్నారు...రాజగోపాల్పై వీహెచ్ సెటైర్లు
ABN , First Publish Date - 2022-07-26T18:29:34+05:30 IST
పార్టీ మారే యోచనలో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్ వీ.హనుమంతరావు సెటైర్లు విసిరారు.
హైదరాబాద్: పార్టీ మారే యోచనలో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy rajagopal reddy)పై పీసీసీ మాజీ చీఫ్ వీ.హనుమంతరావు(V.Hanumanth rao) సెటైర్లు విసిరారు. గాంధీభవన్లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో వీహెచ్ మాట్లాడుతూ... పీఏసీ మీటింగ్స్ పెడుతూ సీనియర్లతో మాట్లాడితే అధిష్టానానికి వాస్తవాలు తెలుస్తాయన్నారు. బీజేపీ(BJP) గెలుస్తదని కొందరు కలలు కంటున్నారని వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ(Sonia gandhi)ని జైల్లో పెడితే దేశం అగ్నిగుండం అవుతుందని అన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి(Subrahmanya Swami) ఒక బ్లాక్ మెయిలర్ అని విరుచుకుపడ్డారు. ఒకే కేసులో విచారణకు ఇన్నిన్ని గంటలు అవసరమా? అని ప్రశ్నించారు. ఈడీ(ED) దగ్గర దమ్ము లేదని విమర్శించారు. నాగపూర్ నుండి అడ్వైజ్ రాగానే ఇక్కడ రెచ్చగొట్టే టెర్రరిస్టులు బీజేపీ వాళ్లు అని ఆయన మండిపడ్డారు.
ఇన్నిరోజులు ఎగరేయని జెండా ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు బీజేపీ పుట్టనేలేదన్నారు. అక్టోబర్ 2న కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగురేయాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్(Bandi sanjay) ఏం చేస్తున్నాడని ఊర్లు తిరుగుతున్నారని నిలదీశారు. బీజేపీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు సోనియా, రాహుల్ను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హామీల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే ఈడీ కేసులు అని వీహెచ్ పేర్కొన్నారు.