దేశాభివృద్ధికి కాంగ్రెస్ ఎనలేని సేవలు
ABN , First Publish Date - 2022-08-11T06:49:01+05:30 IST
దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవలు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం నగరంలోని రైల్వే న్యూకాలనీ ప్రాంతంలో ‘ఆజాద్ కీ గౌరవ యాత్ర’ పేరిట ర్యాలీ నిర్వహించారు.
‘ఆజాద్ కీ గౌరవ యాత్ర’లో పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్
జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు
దొండపర్తి(విశాఖపట్నం), ఆగస్టు 10: దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవలు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం నగరంలోని రైల్వే న్యూకాలనీ ప్రాంతంలో ‘ఆజాద్ కీ గౌరవ యాత్ర’ పేరిట ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఏర్పాటుచేసుకున్నామన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, విద్యా రంగాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేసిందని ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించిందని, పేదలకు ఉచితంగా భూమి పంపిణీ చేసిందన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గొంప గోవిందరాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన
ర్యాలీ సందర్భంగా విలేఖరులతో శైలజానాథ్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. మోదీకి జగన్ దాసోహం అయ్యారని, వారిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చినా ప్రత్యేక హోదా తేలేకపోయిందన్నారు. విశాఖలోని రుషికొండను చూస్తే ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా వుందో అందరికీ అర్థమవుతుందని అన్నారు. మహిళ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.