పంజాబ్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ సలహా

ABN , First Publish Date - 2022-04-10T16:42:22+05:30 IST

బ్రిటిషర్లు సైతం పంజాబ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేవిధంగా ప్రణాళికలు

పంజాబ్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ సలహా

చండీగఢ్ : బ్రిటిషర్లు సైతం పంజాబ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేవిధంగా ప్రణాళికలు రచిస్తున్నానని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా స్పందిస్తూ, ‘‘ముందు మన ఇంటిని చక్కదిద్దండి. న్యాయమైన పరిపాలనను అందించండి’’ అని సలహా ఇచ్చారు. 


ముఖ్యమంత్రి మాన్ శనివారం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈసారి కూడా మూడున్నర లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని, ఒక్కొక్కరితోపాటు రూ.15 లక్షలు కూడా విదేశాలకు వెళ్తోందని అన్నారు. దీనిని మనం సరిదిద్దగలమని నమ్మాలని, ఆ భరోసాను తాను ఇస్తున్నానని చెప్పారు. ‘‘మీరు ఇక్కడే ఉండి, దేశానికి సేవ చేయాలి. మనం మేధో వలసను ఆపాలి. మాకు ఓ అవకాశం ఇవ్వండి. ఉద్యోగాల కోసం బ్రిటిషర్లు ఇక్కడికి వచ్చే విధంగా మేం ప్రణాళికలు రచిస్తున్నాం’’ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో హల్‌చల్ చేస్తోంది. 


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా స్పందిస్తూ, ‘‘ఉద్యోగాల కోసం విదేశీయులు పంజాబ్ రావాలని ఆశిస్తున్నాను, కానీ అంతకన్నా ముందు మనం మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా చూడాలి, శాంతిభద్రతలను కాపాడాలి, అవినీతిని అంతం చేయాలి, పోలీసులను, సివిల్ అధికార యంత్రాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉండేలా చేయాలి, కూలీలు, రైతులు రుణ భారంతో ఆత్మహత్యలు చేసుకోకుండా నిరోధించాలి, న్యాయమైన పరిపాలనను అందించాలి’’ అని ట్విటర్ వేదికగా సలహా ఇచ్చారు. 


Updated Date - 2022-04-10T16:42:22+05:30 IST