ఈశ్వరప్పను అరెస్టు చేయాల్సిందే: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-04-16T18:38:38+05:30 IST

కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఈశ్వరప్పను తక్షణం అరెస్టు చేయాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సచివాలయంలో విధానసౌధలో

ఈశ్వరప్పను అరెస్టు చేయాల్సిందే: కాంగ్రెస్‌

బెంగళూరు: కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఈశ్వరప్పను తక్షణం అరెస్టు చేయాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సచివాలయంలో విధానసౌధలో శుక్రవారం 24 గంటలపాటు నిరవధిక ధర్నా సందర్భంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, శాసనసభలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పరిషత్‌లో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌లు ముక్తకంఠంతో ఇదే ప్రధాన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 40 శాతం కమీషన్‌ దందా జరుగుతోందని కొద్దికాలంగా తాము చేస్తూ వచ్చిన ఆరోపణలు సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యతో రుజువయ్యాయన్నారు. మంత్రిగా ఉండి 40 శాతం కమీషన్‌ కోసం కాంట్రాక్టర్‌ను మానసికంగా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన కారణంగానే ఈశ్వరప్ప అరెస్టుకోసం తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈశ్వరప్ప అరెస్టు జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈశ్వరప్పను కాపాడేందుకు సీఎం, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. 


అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు: సీఎం 

సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని, ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. గదగ్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈశ్వరప్ప రాజీనామా కోసం కాంగ్రెస్‌ పట్టుపడుతున్న వైనాన్ని దు య్యబట్టారు. కాంగ్రెస్‌ నేతలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాగా సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ ఈశ్వరప్ప రాజీనామా కోసం కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తుండడం సిగ్గుచేటన్నారు. ఈశ్వరప్ప ఎలాంటి తప్పు చేయలేదని వెనకేసుకొచ్చారు. 

Updated Date - 2022-04-16T18:38:38+05:30 IST