Kerala's Thrikkakara bypolls: కాంగ్రెస్ అభ్యర్థిని ఉమా థామస్ గెలుపు
ABN , First Publish Date - 2022-06-03T19:54:10+05:30 IST
కేరళలోని త్రిక్కకర శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప
తిరువనంతపురం : కేరళలోని త్రిక్కకర శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఉమా థామస్ విజయం సాధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీటీ థామస్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఉత్తరాఖండ్లోని చంపావత్, ఒడిశాలోని బ్రజరాజ్ నగర్, కేరళలోని త్రిక్కకర శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చంపావత్ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఫిబ్రవరిలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ధామి ఖటిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా శాసన సభ్యునిగా ఎన్నికవడం తప్పనిసరి. ఇది రాజ్యాంగపరమైన అవసరం. తాజాగా ఆయన విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తబోవు.
కేరళలోని త్రిక్కకరలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థిని ఉమా థామస్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఆమెకు తన సమీప ప్రత్యర్థి, వామపక్షాల అభ్యర్థి జో జోసఫ్పై దాదాపు 25 వేల ఓట్ల ఆధిక్యత లభించింది.
ఒడిశాలోని బ్రజ్రాజ్ నగర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రధానంగా బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగింది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మరణించడంతో ఆయన సతీమణి అలక మహంతిని అధికార పార్టీ బీజేడీ ఎన్నికల బరిలో నిలిపింది. అలక మహంతి ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యత కనబరిచారు.