ప్రభుత్వం జనం దృష్టి మళ్ళిస్తోంది : కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-11-24T02:08:04+05:30 IST

ధరల పెరుగుదల వంటి అసలు సమస్యల నుంచి

ప్రభుత్వం జనం దృష్టి మళ్ళిస్తోంది : కాంగ్రెస్

న్యూఢిల్లీ : ధరల పెరుగుదల వంటి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. బీజేపీ ఎన్నికల నినాదం ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) బండారం ఎప్పటికప్పుడు బయటపడుతోందని మండిపడింది. 


బట్టలు, కొన్ని సరుకులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంపును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. అచ్ఛే దిన్ అసలు స్వరూపం ఎప్పటికప్పుడు బయటపడుతోందన్నారు. జీఎస్టీ 140 శాతం పెరిగిందని, అచ్ఛే దిన్ వాస్తవాలు బయటపడటం కొనసాగుతోందన్నారు. 


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ పాలనలో ఖరీదు కానిదేదీ లేదన్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో ప్రతి రోజూ ప్రజలపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విలేకర్లతో మాట్లాడుతూ, నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నారని తెలిపారు. వంట గదిలో సెక్షన్ 144 అమలవుతున్నట్లుందన్నారు. నాలుగు టమాటాలు లేదా నాలుగు ఉల్లిపాయలు ఉండటానికి వీల్లేకుండా పోయిందన్నారు. అందుకే ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నిస్తోందని, అసలు సమస్యల నుంచి సమస్యలు కాని అంశాలపైకి దృష్టి సారించే విధంగా చేస్తోందని అన్నారు. 


Updated Date - 2021-11-24T02:08:04+05:30 IST