బీజేపీకి శుభాకాంక్షలు : శశి థరూర్
ABN , First Publish Date - 2022-04-06T18:33:14+05:30 IST
వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకుంటున్న భారతీయ
న్యూఢిల్లీ : వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకుంటున్న భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాజ్యాంగంలో పేర్కొన్న ఆదర్శాలలో దేనినీ ఆ పార్టీ అనుసరించడం లేదని, ఇది కూడా పార్టీ బూటకపు వాగ్దానాల్లో ఒకటేనా? అని నిలదీశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీ స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు.
శశి థరూర్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో, ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బీజేపీ! నేడు నీకు 42 ఏళ్ళు వచ్చాయి. నీ సొంత రాజ్యాంగానికి అనుగుణంగా జీవించడం ప్రారంభించవలసిన సమయం కదా ఇది? నువ్వు నమ్ముతున్న లేదా ఆచరిస్తున్నదాని మొదటి పేజీలో ఏదైనా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ రాజ్యాంగం కూడా నీ సుప్రసిద్ధ బూటకాల్లో ఒకటా?’’ అని ఎద్దేవా చేశారు.
ఇదిలావుండగా, థరూర్ షేర్ చేసిన బీజేపీ రాజ్యాంగంలోని తొలి పేజీలో, భారత దేశాన్ని బలమైన, సౌభాగ్యవంతమైన దేశంగా నిర్మిస్తామని ఆ పార్టీ ప్రతిజ్ఞ చేసింది. ఆధునిక, ప్రగతిశీల, విజ్ఞానదాయక భారత దేశ నిర్మాణానికి కృఫి చేస్తామని తెలిపింది.
బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్య 100కు చేరిందని, ఈ తరుణంలో ఈ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు.