ఇంటర్మీడియట్ పరీక్షల్లో గందరగోళం
ABN , First Publish Date - 2022-05-13T06:54:57+05:30 IST
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒకవిధంగా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. హిందీ మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశ్నాపత్రం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు.
ప్రశ్నాపత్రం లేక హిందీ మీడియం విద్యార్థుల ఇబ్బందులు
సీఎస్, డీవోల ఇష్టారాజ్యంతో పరీక్ష సమయాల్లో మార్పులు
నిజామాబాద్ అర్బన్, మే 12: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒకవిధంగా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. హిందీ మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశ్నాపత్రం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు. బుధ, గురువారాల్లో జరిగిన ఇంట ర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం సివిక్స్ పరీక్షకు హిందీ మీడియంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హిందీలో ప్రశ్నాపత్రం లేకపోవడంతో ఇంగ్లిష్ మీడియం ప్రశ్నాపత్రాన్ని హిందీలోకి తర్జుమాచేసి పరీక్ష రాయించినట్లు తెలుస్తోంది. సంబంధిత సబ్జెక్టుకు చెందిన హిందీ మీడియం లెక్చరర్ను అరగంట ముందు పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చి ఇంగ్లిష్ మీడియం ప్రశ్నాపత్రాన్ని హిందీలోకి తర్జుమా చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు సమయం సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. జిల్లాలో హిందీ మీడియానికి సంబంధించి ఆరుగురు విద్యార్థులు మొదటి సంవత్సరం, ఏడుగురు విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇంగ్లిష్ మీడియం ప్రశ్నాపత్రాన్ని హిందీలోకి తర్జుమాచేసి పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఐఈవో రఘురాజ్ తెలిపారు.
ఇష్టారాజ్యంగా సీఎస్, డీవోల తీరు..
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల తీరు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండగా సీఎస్, డీవోల నిర్లక్ష్యంతో ఇష్టారీతిన సమయాన్ని మారుస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా పరీక్షలను సమయం ప్రకారం కాకుండా 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించి 15 నిమిషాలు ఆలస్యంగా పేపర్ తీసుకుంటున్నట్లు సమాచారం.
6వ రోజు పరీక్ష ప్రశాంతం..
ఇంటర్ వార్షిక పరీక్షల్లో 6వ రోజు గురువారం గణితం-2ఏ, సివిక్స్-2, బోటని-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 17,892 మంది విద్యార్థులకుగాను 16,965 మంది హాజరుకాగా 927 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో రఘురాజ్ బోధన్లోని విజయ్సాయి, షిర్డిసాయి, ఉషోదయ, విద్యావికాస్, వెంకటేశ్వర, వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు.