కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2021-11-26T04:23:44+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు వర్గాల్లో అంతర్లీనంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు పార్టీ అగ్రనాయకుల సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దూషణల పర్వానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
హన్మంతరావు కారును అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

ఇరువర్గాల కార్యకర్తల బాహాబాహీ

సీనియర్‌ నేత వీహెచ్‌ వాహనం అడ్డగింత

గో బ్యాక్‌ నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ ప్రాంగణం

మంచిర్యాల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు వర్గాల్లో అంతర్లీనంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు పార్టీ అగ్రనాయకుల సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దూషణల పర్వానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా చైతన్యయాత్ర’లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్‌రావు ఆదేశాలతో నాయకులు, కార్యకర్తలు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇదే కార్యక్రమానికి ప్రత్యర్థివర్గం నాయకులు రావడం ఆందోళనకు దారితీసింది. 

చిచ్చురేపిన ప్రోటోకాల్‌

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్యయాత్రలో ప్రోటోకాల్‌ చిచ్చురేపింది. జిల్లాకు సంబంధించి ప్రజాచైతన్యయాత్ర నిర్వహణ బాధ్యతలను మొదట కాంగ్రెస్‌ నేత, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బి జనక్‌ప్రసాద్‌కు అప్పగించారు. అనంతరం రెండు రోజుల కిందట  యాత్ర ఇన్‌చార్జిగా ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావుకు పీసీసీ అధికార ప్రతినిధి అప్పగించారు.  యాత్ర సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ప్రేంసాగర్‌రావు వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి నిరసన తెలుపుతుండగా అదే సమయంలో జనక్‌ప్రసాద్‌ తన అనుచరులతో కలిసి కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రేంసాగర్‌రావు వర్గీయులు ప్రోటోకాల్‌ పాటించకుండా నిరసన కార్యక్రమానికి ఎలా హాజరవుతారంటూ  అడ్డుకున్నారు. కేవలం ముగ్గురు నలుగురిని వెంటేసుకొని వచ్చి కార్యక్రమం క్రెడిట్‌ను సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 

వీహెచ్‌ వాహనం అడ్డగింత

జనక్‌ప్రసాద్‌తోపాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హన్మంతరావు, మాజీ మంత్రి, క్రమశిక్షణ కమిటీ గడ్డం వినోద్‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సొత్కు సంజీవరావు, కేవీ ప్రతాప్‌ తదితరులు కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. ప్రేంసాగర్‌రావు వర్గీయులు వీహెచ్‌ కారును అడ్డుకున్నారు. జనక్‌ప్రసాద్‌ వర్గీయులను కారులో నుంచి కిందకు దిగకుండా చుట్టుముట్టారు. డీసీసీ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు తాము నిరసన తెలుపుతున్నామని,  ఆమెకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జనక్‌ ప్రసాద్‌తో కలిసి ఎలా హాజరవుతారని వీహెచ్‌తో వాదనకు దిగారు. వీహెచ్‌ అంటే తమకు వ్యతిరేకం కాదని, ఏనాడు పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోని వాళ్లతో కలిసి రావడంతోనే తాము అభ్యంతరం చెబుతున్నామన్నారు. వీహెచ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తాను అధిష్టానం పంపితేనే కార్యక్రమానికి వచ్చానని, తనను అడ్డుకోవడం సమంజసం కాదని వీహెచ్‌  అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాము ఊరూరా తిరుగుతున్నామని, ఏనాడు నన్ను ఎవరూ దూషించలేదన్నారు. డీసీసీ అధ్యక్షురాలికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కార్యకర్తల ప్రవర్తన బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వినోద్‌తో కలిసి ఆయన కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. 

Updated Date - 2021-11-26T04:23:44+05:30 IST