పాములవాకలో లేఅవుట్ పనులు అడ్డుకున్న దళితులు
ABN , First Publish Date - 2020-07-05T09:46:26+05:30 IST
పాములవాకలో దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో లేఅవుట్ వేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను సాగుదారులు అడ్డుకోవడంతో
పోలీసుల రంగప్రవేశం
ఆర్డీవో హామీతో సద్దుమణిగిన వివాదం
కోటవురట్ల, జూలై 4: పాములవాకలో దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో లేఅవుట్ వేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను సాగుదారులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పాములవాక గ్రామంలో పట్టాలమ్మగుడి వద్ద సర్వే నంబరు 86/1బిలో 6.41 ఎకరాల స్థలంలో ఆ గ్రామానికి చెందిన దళితులు 12 మంది గత 40 సంవత్సరాలుగా సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ భూమిలో 87 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్చి రెండున అధికారులు పనులు ప్రారంభించగా దళిత రైతులు అడ్డుకున్నారు.
అప్పట్లో నష్టపరిహరం ఇప్పిస్తామని నర్సీపట్నం ఆర్డీవో హమీ ఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు. నాటినుంచి నేటికీ నష్టపరిహారం ఇవ్వకుండా శనివారం నేరుగా ఆ భూముల్లోకి లేఅవుట్ పనులు చేసేందుకు వెళ్లిన అధికారులను సాగుదారులు అడ్డుకున్నారు. అధికారుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గ్రామంలో పెద్దలు జోక్యం చేసుకుని గతంలో ఆర్డీవో ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. దీంతో నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మిశివజ్యోతి గ్రామానికి హుటాహుటిన వచ్చి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్టు వివరించారు. సాగుదారులు తమకు ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేయగా ఆమె అంగీకరించారు. దీంతో వివాదానికి తెరపడింది.