పునరావాసం కల్పించే వరకూ ఆందోళనలు
ABN , First Publish Date - 2022-01-29T06:30:35+05:30 IST
పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ చర్లగూడెం రిజర్వాయర్ పనులను నిర్వాసితులు శుక్రవారం అడ్డుకున్నారు.
మర్రిగూడ, జనవరి 28: పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ చర్లగూడెం రిజర్వాయర్ పనులను నిర్వాసితులు శుక్రవారం అడ్డుకున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించకుండా పనులను ఏవిధంగా చేపడుతున్నారని నర్సిరెడ్డిగూడెం గ్రామ బాధితులు పనులను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం ఏడున్నర సంవత్సరాలుగా ప్యాకేజీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని, పనులను అడ్డుకుంటుంటే అధికారులు కావాలని బలవంతంగా పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనాస్థలానికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. నిర్వాసితుల ఆందోళనతో పనులను నిలిపివేశారు.