మంత్రి వ్యాఖ్యలపై నిరసన
ABN , First Publish Date - 2021-12-03T05:14:01+05:30 IST
పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు నిరసన తెలిపారు. కాశీబుగ్గలో బుధవారం ‘ఓటీఎస్’పై నిర్వహించిన సమీక్షలో ‘వీఆర్వోల సేవలు మా నియోజకవర్గానికి అవసరం లేదు. సచివాలయాలకు వీఆర్వోలు వస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు తరిమికొట్టాలి’ అని మంత్రి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
నల్లబ్యాడ్జీలతో వీఆర్వోల ఆందోళన
పలాస/ పలాస రూరల్, డిసెంబరు 2 : పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు నిరసన తెలిపారు. కాశీబుగ్గలో బుధవారం ‘ఓటీఎస్’పై నిర్వహించిన సమీక్షలో ‘వీఆర్వోల సేవలు మా నియోజకవర్గానికి అవసరం లేదు. సచివాలయాలకు వీఆర్వోలు వస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు తరిమికొట్టాలి’ అని మంత్రి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలాసలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోల సంఘ అధ్యక్షుడు కె.శ్రావణ్ అధ్యక్షతన నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మంత్రి అప్పలరాజు, మునిసిపల్ కమిషనర్ రాజగోపాలరావు తమను అవమానపరిచేలా మాట్లాడడం తగదని మండిపడ్డారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు కె.ఖగేశ్వరరావు, సింహాచలం, సోమేశ్వరరావు, శ్రీనివాసరావు, ఎ.ప్రసాద్, ఆర్ఐ రవి పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పాల్సిందే : టీడీపీ నేతల డిమాండ్
ప్రభుత్వ అభ్యున్నతికి నిత్యం కృషి చేసే వీఆర్వోలను మంత్రి సీదిరి అప్పలరాజు కించపరచడం తగదని, వారికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పలాస టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పలాసలో రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్రావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. ఓటీఎస్ సమావేశాలకు వీఆర్వోలను పిలిచి కమిషనర్, మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కలెక్టర్ సమక్షంలోనే వీఆర్వోలపై మంత్రి అలా వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. వీఆర్వోలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. పేదలకు ఇళ్ల హక్కు పత్రాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. పేదల కడుపుకొడితే.. పుట్టగతులు ఉండవని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్, గురిటి సూర్యనారాయణ, సప్ప నవీన్, యవ్వారి మోహనరావు, జోగ మల్లేశ్వరరావు, చంద్రరావు, షణ్ముఖరావు పాల్గొన్నారు.